కృష్ణా నదీ జలాల వివాదంలో ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల నాయకుల మధ్య వాదనలు వాడి వేడిగా సాగుతున్నాయి. తాజాగా వైయస్సార్ ఒక నరరూప రాక్షసుడని, జగన్ ఒక ఊసరవెల్లిలా తయారయ్యాడని టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… తెలంగాణ నాయకుల వాదన కేవలం రాజకీయ లబ్ది కోసమేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని అన్నారు. నీటి వివాదంపై తెలంగాణ నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు లేదా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. భావోద్వేగాలను రేకెత్తించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధం పెట్టుకోవడమే సిఎం వైఎస్ జగన్ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు కూడా తీసుకోవడం లేదని నాని వ్యాఖ్యానించారు. శ్రీశైలం మరియు సాగర్లలో కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామన్నారు. కృష్ణ నీటి వివాదంపై కెసిఆర్ తో చర్చలకు సిఎం జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ కోసం వైయస్సార్ ఏమి చేశారో అందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణలో కొందరు నాయకులు రాజకీయ లాభాల కోసం వైయస్ఆర్ ను విమర్శిస్తున్నారని నాని ఆరోపించారు.