తుడిచేసుకోవడానికి వీల్లేని మరక ఇది. ఔను, చంద్రబాబు పొలిటికల్ కెరీర్లో ఇదొక బ్లాక్ మార్క్.! ‘మేం ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో వున్నాం.. ఎన్నో వందల సభలు పెట్టాం. ఎప్పుడూ ఇలా జరగలేదు.. జరిగింది దుర్ఘటన.. దాన్ిన రాజకీయం చేయడం తగదు..’ అంటూ చంద్రబాబు మొత్తుకుంటున్నారు కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి.
నిజానికి, ఇది దుర్ఘటన కాదు. పెను ప్రమాదం. దారుణమైన నిర్లక్ష్యం కారణంగా జరిగిందిది. ఓ రాజకీయ పార్టీ ప్రచార యావ.. ఓ ప్రభుత్వ అసమర్థత.. ఓ వ్యస్థ చేతకానితనం.. ఇలా ఇన్ని కారణాలున్నాయి.
తప్పు తనవైపు వుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే, బాధిత కుటుంబాలకు పరిహారం పెంచుకుంటూ పోతున్నారు. తొలుత పది లక్షలు అన్నారు.. ఆ తర్వాత అది 23 లక్షలకు చేరింది.. ఇంకా ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు దాదాపు ముప్ఫయ్ లక్షలని అంటున్నారు.
ఇంకా ఇంకా ఈ పరిహారం పెరుగుతూ పోవచ్చు. ఎన్ని లక్షలు వెదజల్లినా పోయినోళ్ళు తిరిగిరారు.. పాప పరిహారం జరిగే అవకాశమే లేదు. గతంలో పుష్కరాల ఘటన.. ఇప్పుడేమో ఇది. ‘అబ్బే నాకేటి సంబంధం.?’ అని చంద్రబాబు అనలేరు. ఆ పాపానికి నివృత్తి అనేదే లేదు.
నిజానికి, ఈ విషయంలో అధికార పార్టీ రాజకీయం చేయడమూ సరికాదు. శవాల మీద పేలాలు ఏరుకున్న సందర్భమే కాదిది. పోలీసు వైఫల్యమంటే.. అది ప్రభుత్వ వైఫల్యమే. నైతిక బాధ్యత ప్రభుత్వానిది కూడా. అంటే, పాపంలో చంద్రబాబుతోపాటు వైఎస్ జగన్ కూడా వాటా పంచుకోవాల్సి వస్తుందన్నమాట.
