చంద్రబాబు.. నక్కా.. సింహం..: పవన్ ని ఇరికించేసిన అంబటి!

గతకొన్ని రోజులుగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు… అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్న సంగతి తెలిసిందే. సందర్భం దొరకడం ఆలస్యం… వారిద్దరికీ ఇచ్చిపడేస్తున్నారు అంబటి. ఈ క్రమంలో తాజాగా మరోసారి మైకందుకున్న అంబటి… చంద్రబాబు – పవన్ కల్యాణ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… తూర్పుగోదావరి జిల్లాలోని రామ్మోహన్‌రావు జయంతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు… టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌ లపై మరోసారి విసుర్లు విసిరారు. పుంగనూరులో జరిగిన గొడవ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య కాదని.. పోలీసులు, చంద్రబాబు మధ్య జరిగిన గొడవ అని క్లారిటీ ఇచ్చారు అంబటి.

షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన రూట్ మ్యాప్‌ లో వెళ్లి ఉంటే.. ఏ సమస్యా ఉండేది కాదని.. కానీ, అనుమతి లేని చోట చంద్రబాబు కావాలనే వెళ్లి రచ్చ చేయాలని చూశారని అంబటి తెలిపారు. పోలీసులపై చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి అమానుషం అని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శాంతి, విపక్షంలో ఉన్నప్పుడు అశాంతి కోరుకుంటున్నారని అంబటి ఆరోపించారు.

ఇదే సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై చేసిన దాడి అమానుషం అని మంత్రి మండిపడ్డారు. తాజాగా తాను సింహాన్నని చంద్రబాబు ప్రకటించుకున్నారని.. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది కానీ, నక్క సింహంలా ఎలా మారుతుందో తెలియడం లేదని అంబటి ఎద్దేవా చేశారు.

అనంతరం పవన్ పై స్పందించారు అంబటి. ఆయన బ్రో సినిమా ఫ్లాప్ అయ్యిందని.. ఈ సినిమా తక్కువ కలెక్షన్లు రాబట్టిందని అంబటి చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా… తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పలేని వాడు.. రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తాడు అని అంబటి ప్రశ్నించారు. దీంతో పవన్ ను ఇరికించేశారని అంటున్నారు పరిశీలకులు.