పవన్‌తో సినీ నటుడు అలీ భేటీ ….ఎందుకు? అలీ ఏమన్నారు?

టాలీవుడ్ స్టార్ కమిడియన్ అలీ రాజకీయ ప్రవేశంపై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఈనెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఆరోజు జరిగే ముగింపు సభలో అలీ పాల్గొని వైకాపా కండువా కప్పుకొంటారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి సోషల్ మీడియాల్లో నిన్న భారీ స్దాయిలో ప్రచారం జరిగింది. అయితే, ఈ రోజు అలీ ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ని కలిసారు. దాంతో మీడియా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ భేటికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

అలీ ఈ రోజు …విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో కొద్ది సేపు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ .. అలీని జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేసారని, పార్టీలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని అలీ చెప్పినట్లు వినికిడి.

అలీ మాట్లాడుతూ… కొత్త సంవత్సరం వచ్చాక పవన్ కళ్యాణ్‌ను కలవలేదని, అందుకే కలిసేందుకు వచ్చానని తనను సంప్రదించిన మీడియాకు చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే పవన్‌ను కలిశానని చెప్పారు. జనసేనానిని మర్యాదపూర్వకంగానే కలిశానని, ఎలాంటి రహస్యం లేదని తేల్చి చెప్పారు. కలవడానికి ప్రాధాన్యత లేదన్నారు. జగన్‌తో భేటీపై ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అలీ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో అన్నీ చెబుతానని అన్నారని తెలుస్తోంది.

ఈ సంఘటనతో సినీ పరిశ్రమలో పవన్‌ కల్యాణ్‌కు క్లోజ్ ఫ్రెండ్ గా ఉండే అలీ జనసేన పార్టీలోనే చేరుతారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న విషయాలను, పరిణామాలు చూస్తే అలీ వైకాపాలో చేరికకు బ్రేక్‌ పడినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇక, సినీ నిర్మాత, అశ్వనీదత్‌తో కలిసి అలీ ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలవడం విశేషం.