పవన్ కాన్వాయ్ లో ప్రమాదం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. తుఫాను బాధితులను పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బోరుభద్ర గ్రామం వద్ద పవన్ కాన్వాయ్ లోని ఓ వాహనం తేజ అనే యువకుడిని ఢీకొట్టింది. అతని కాలు మీది నుంచి టైర్ వెళ్లడంతో అతనికి గాయాలయ్యాయి.

దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పవన్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. తేజ కి చికిత్స చేయిస్తామని హామీనివ్వడంతో వారు శాంతించారు. జనసేన నాయకులు తమ వాహనంలో తేజను శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. తేజ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అతనికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

ప్రమాద విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తేజకి మెరుగైన చికిత్స అందించాలని జనసేన కార్యకర్తలకు సూచించారు. ఆస్పత్రి ఖర్చు అంతా జనసేన భరిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారని నేతలు బాధితుని కుటుంబ సభ్యులకు చెప్పారు. పవన్ తేజను కలవాలనుకున్నా సమయాభావం వల్ల శ్రీకాకుళం  రాలేకపోతున్నాడని నేతలు తెలిపారు.