జనసేనకు 7 సీట్లంట.! పండగ చేస్కోండిక.!

2019 ఎన్నికల్లో ఒక్క సీటైనా వచ్చింది. 2024 ఎన్నికల్లో గుండు సున్నానే.. అంటూ జనసేన గురించి అధికార వైసీపీ ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మేమే అధికారంలోకి వస్తాం.. మీ సంగతి తేలుస్తాం..’ అంటోంది వైసీపీని ఉద్దేశించి జనసేన పార్టీ. ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళ సంగతి పక్కన పెడితే, ఓ ఆసక్తికరమైన సర్వే వెలుగు చూసింది.

ఆ సర్వేలో వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని తేలింది. కాకపోతే, టీడీపీ కూడా పుంజుకుంటుందట. జనసేన పార్టీకి సైతం ఈసారి ఓటర్లు బాగానే సీట్లు ఇవ్వబోతున్నారట. డబుల్ డిజిట్ టచ్ చేయడం కష్టం గానీ, ఓ ఏడెనిమిది సీట్లు రావొచ్చన్నది సదరు సర్వే సారాంశం. ఏడెనిమిది కాదు.. ఏడు సీట్లేనట.

టీడీపీకి ఓ నలభై సీట్లు రావొచ్చునట. వైసీపీకి గణనీయంగా సీట్లు తగ్గబోతున్నాయ్. ఈ సర్వేలో షాకింగ్ అంశం జనసేనకు ఏడు సీట్లు వస్తాయని చెప్పడమే. బహుశా ఆ ఫిగర్‌ని జనసేన కూడా ఊహించుకుని వుండదేమో.. అన్న చర్చ నడుస్తోంది. పండగ చేసుకుంటున్నారు జనసేన నేతలు.. అంటూ ఈ సర్వేపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకవేళ టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం, జనసేన ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తుందిట. ఏమో.. గుర్రం ఎగరావచ్చు.. అన్నట్టుగా హంగ్ ఏర్పడితే.. జనసేన పాత్ర కీలకం కాబోతుందట. ఆ ఛాన్సే లేదన్నది వైసీపీ వాదన. ఔను మరి, వైసీపీ టార్గెట్ ఏకంగా 175. అలాంటప్పుడు.. ఈ తరహా సర్వేల్ని వైసీపీ ఎందుకు ఒప్పుకుంటుంది.?

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. సర్వేల సంగతెలా వున్నా, జనసేన చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈసారి ప్రభావం చూపొచ్చునన్నది ప్రధాన రాజకీయ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.