ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని రాజకీయ పార్టీల ముఖచిత్రం పార్టీల్లో వున్నఅభద్రతాభావాన్ని తెలియచేస్తుంది .ఒకరు చేసే ప్రకటనకు అదే పార్టీలో మరొకరు చేసే ప్రకటనకు పొంతన వుండటం లేదు. రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడినా మరు రోజే భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి. ఇటీవల జనసేన అధినేత ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తో సమావేశమై రెండు పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఏమైందో తెలియదు.? తదుపరి ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పార్టీలు కలసి కార్యక్రమాలు అమలు చేసిన జాడ లేదు. ఈ లోపే వైసిపి బిజెపితో పొత్తు పెట్టుకుంటుందని ఎన్డీఏలో చేరుతుందని కేంద్రంలో రెండు మంత్రి పదవులు దక్కించుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి.
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానం వస్తే ఎన్డీఏలో చేరితే తప్పే ముందని అనుకూల సంకేతాలు ఇచ్చారు. తిరిగి ఏమైందో తను అలా అనలేదని ప్రకటన చేశారు. ఈ లోపు మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి చెబితేనే ఖరారని మంత్రులు చిట్ చాట్ గా మాట్లాడితే సరికాదని ప్రకటన చేశారు. అంతేకాదు. బిజెపికి మాతో అవసరం వస్తుందని చెబుతూ పరోక్షంగా ద్వారాలు తెరిచి వుంచారు. పైగా కడప వైసిపి శాసన సభ్యులు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా బిజెపితో పొత్తు వుండదని అది తీసుకు వచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అవసరమైతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. ఈ లోపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజెపి పెద్దలను కలసి ప్రభుత్వ పరంగా విన్నపాలు సమర్పించి వచ్చారు.ఇంత జరుగుతున్నా గమనార్హమైన అంశమేమంటే వైసిపిలో డిక్టేటర్ గా వుండే ముఖ్యమంత్రి నుండి మాట రాకపోవడమే.
ఇది ఇంతటితో ఆగితే ఫర్వాలేదు. ఢిల్లీ వెళ్లి బిజెపితో పొత్తు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకున్న పవన్ కళ్యాణ్ వైసిపితో బిజెపి పొత్తు వుండదని తనే ప్రకటన చేశారు. అంతటితో ఆగ కుండా ఎందుకైనా మంచిదను కొని వైసిపితో బిజెపి పొత్తు పెట్టుకుంటే తాను బిజెపితో కటీఫ్చే సుకుంటానని ప్రకటించారు. ఈ కప్పల తక్కెడ కథ ఇంకా వుంది. బిజెపి జాతీయ కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ ఇన్ చార్జి సునీల్ దేవధర్ విశాఖలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో తాము ప్రతిపక్షంలో వున్నామని జనసేనతోనే తమ పొత్తు వుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలపై నిప్పులు చెరిగారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ మూడు రాజధానులకు కేంద్రం ఎక్కడ అనుమతి ఇచ్చిందో చూపమని సవాల్ చేశారు ఇదిలా వుండగా బిజెపి నేత పురందరేశ్వరి జనసేనతోనే తమ పొత్తు అని చెబుతూ శాసన మండలి రద్దు సరైన చర్య కాదన్నారు. ఇంతలోనే రాష్ట్ర .మరొక బిజెపి నేత సోము వీర్రాజు శానస మండలి రద్దు గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని అంటే ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ వుందని జాతీయ నేత దేవధర్ చెప్పిన ఒకే రాష్ట్రం ఒకే రాజధాని గురించి దాట వేశారు. వాస్తవంలో బిజెపి కట్టుదిట్టమైన క్రమశిక్షణ గల పార్టీ. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం క రెండు మూడు వర్గాలుగా చీలి పోయారు. ఇదంతా గమనించే వాళ్లకు వైసీపీ జనసేన బీజేపీ మూడుముక్కలాట ఆడుతున్నట్టు కనిపిస్తుంది.
