వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు పెట్టుకున్నారు.
శాసన మండలి కార్యదర్శి ద్వారా సెలక్ట్ కమిటీ ఏర్పడకుండా చేయ గలిగారు. గాని ముందుకు పోయేందుకు తరుణోపాయం కనిపించ లేదు. చట్ట సభలు ప్రోరోగ్ చేయబడ్డాయి-కాబట్టి ఆర్డినెన్స్ తీసుకు వచ్చే ఆలోచన చేశారు. అదీ కుదర లేదు. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు వున్నందున కథ తిరిగి మొదటికి వస్తుందనే భయంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.
ఇక మిగిలిందల్లా ఎంత త్వరగా శాసన మండలి రద్దు అయితే ఆమేరకు వెసులు బాటు కలుగుతుంది. అందుకే ఒకటికి రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఢిల్లీ పెద్దలతో జరిపిన చర్చల్లో శాసన మండలి రద్దుకు కేంద్రం సహకరించునట్లు హామీ లభించిందని వైసిపి వర్గాలే కాకుండా టిడిపి నేతలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి శాసన మండలి రద్దును కోల్డ్ స్టోరేజ్ లో పడ వేయాలనుకుంటే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు శాసన మండల్లు ఏర్పాటుకు అభ్యర్థనలు పంపివున్నా అవన్నీ పెండింగ్ లో వున్నాయి. ఆ బోగీలకు శాసన మండలి రద్దు కూడా తగిలించితే ఇప్పట్లో మోక్షం వుండదు. కాని ఆలా కాకుండా శాసన మండలి రద్దుకు కేంద్రంలోని పెద్దలు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు మార్చి నెలలో రద్దు జరిగి పోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
రాజధాని తరలింపులో న్యాయ సంబంధ మైన అంశాలు ఇమిడి వున్నందున కేంద్రం నుండి గట్టి హామీ లభించ లేదంటున్నారు. గాని శాసన మండలి మాత్రం రద్దు ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే శాసన సభ ఆమోదించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించితే దాని కథ ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో బిజెపి వైసిపిల మధ్య పొత్తు గురించి భిన్నమైన వార్తలు వచ్చినా త్వరగా శాసన మండలి రద్దుకు బిజెపి వైసిపి పొత్తుకు లింకు మాత్రం పెడుతున్నారు. ఉన్నత స్థాయిలో జరుగుతున్న చర్చలకు రెండు పార్టీల రాష్ట్ర నేతల ప్రకటనకు పొంతనే లేదని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా రాజ్యసభ ఎన్నికల పూర్తయ్యే నాటికి శాసన మండలి రద్దు బిజెపి వైసిపి పార్టీల పొత్తు తేలి పోవడం ఖాయం.
