మంచు మనోజ్ ఏ  పార్టీకి మద్దతు?అసలు ఆలోచన ఏంటి?

మంచు మనోజ్‌ ఈ మధ్యకాలంలో వరస ఫ్లాఫ్ లను చవి చూస్తున్నారు. హీరోగా  చేసినా,గెస్ట్ రోల్ లో చేసినా కూడా రాణించలేదు. ఈ నేపధ్యంలో ఆయన ఓ నిర్ణయం తీసుకుని తన అభిమానులకు ఓ లేఖ రాసారు. తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి షిఫ్ట్‌ అవుతున్నానని తెలిపారు. ఈ లేఖ చదివిన వారంతా మనోజ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు
అర్దం చేసుకున్నారు. అయితే ఆయన ఏ పార్టీ తరుపున ప్రచారం చేస్తారు..ఏ పార్టీకి మద్దతు ఇస్తారు..ఏ పార్టీ తరుపున ఆయన ఎన్నికల్లో నిలబడతారు అనేది చర్చనీయాంశంగా మారింది.

తన తండ్రి మోహన్ బాబు మద్దతు ఇచ్చే పార్టీకే మంచు మనోజ్ …మద్దతు ఉంటుందని ..ప్రచారం చేస్తారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది.అప్పటికప్పుడు హఠాత్తుగా రంగంలోకి దిగి ఆ నాలుగు రోజులు తను ఇష్టపడ్డ పార్టీకి ప్రచారం చేయటం
కన్నా..మొదటి నుంచి ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్లటం మంచిదనే ఈ డెసిషన్ తీసుకున్నాడంటున్నారు. తిరుపతి కేంద్రంగా రాజకీయాల్లోకి వచ్చే ప్రణాళిక చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇంతకీ ఆ లేఖలో ఏముందో ..యధాతథంగా చూద్దాం..

‘తన వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి ‘పరుగు’ కూడా ఒక రోజు పరిగెత్తడం ఆపేస్తుంది. ఇవాళో రేపో ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి తప్పదు. గమ్యంలేని లక్ష్యాలు ఎన్నటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయి. మన ప్రతీ లక్ష్యానికి ఒక గోల్‌ ఉండాలి. ఆ లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్ధరించేలా ఉండాలి. ప్రపంచం మొత్తం తిరిగాను.. అన్ని జాతుల, మతాల, కులాల ప్రజల్ని కలిశాను. ఒక్క చిన్న బ్రెడ్‌ ముక్క కోసం గ్యారేజ్‌లో పనిచేసే వాళ్లను చూశాను. ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను. అన్నీ సంతృప్తితో చేశాను. నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే ఇవన్నీ చేశాను. ప్రపంచంలోని ప్రతి దిక్కూ తిరిగాను. దేశంలోని ప్రతి మూలా
చూశాను. ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం అద్భుతం, అమోఘం’’

‘‘నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం ఇది. స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేసింది ఈ ప్రదేశం. అణువణువు దైవత్వంతో నిండి ఉన్న ఈ తిరుపతి గాలి పీల్చినప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది’’

తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచమంతా చేరువయ్యేలా తపిస్తాను.. ముందుగా ఇక్కడి యువతకి సహాయపడేలా ఏదైనా చేస్తాను. నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలలు తిరుపతికి షిఫ్ట్‌ అవుతున్నాను. రాయలసీమలో ప్రారంభించే నా ఈ సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూడా ఈ అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను.

నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరు ఎలాంటి తీర్మానాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు.. విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనే దాహం ఎన్నటికీ తీరదు. నా జీవితాన్ని ఈ నేల యువతకి అంకితం చేస్తున్నాను. రాయలసీమ వస్తున్నా రాగి సంగటి, మటన్‌ పులుసు సిద్ధంగా పెట్టండి.. మీ మంచు మనోజ్‌’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.