శ్రీదేవి విష‌యంలో అక్కినేని ఇచ్చిన స‌ల‌హా ఏంటి?

                                                              (ధ్యాన్)

అక్కినేని నాగార్జున‌కు `శివ‌`, `గీతాంజ‌లి`తోనే హిట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు స‌న్న‌గా ఉన్నాడ‌ని, గొంతు బాగోలేద‌ని చాలా మంది అన్నారు.ఆ  విష‌యం అప్పుడు ఆయ‌న మ‌న‌సులో నాటుకుపోయింద‌ట‌. దాంతో శ్రీదేవిలాంటి హీరోయిన్ల స‌ర‌స‌న న‌టించ‌డానికి చాలా ఆలోచించేవార‌ట‌. అలాంటి స‌మ‌యంలోనే అశ్వ‌నీద‌త్ `ఆఖ‌రిపోరాటం` సినిమా గురించి చెప్పారు. రాఘవేంద్ర‌రావ సంప్ర‌దించ‌డంతో నాగార్జున వెంట‌నే ఓకే చేసేశారు. అంతా బావుంటుంద‌నుకున్న త‌రుణంలో అశ్వ‌నీద‌త్ వ‌చ్చి నాగార్జున ప‌క్క‌న శ్రీదేవి న‌టిస్తే బావుంటుంద‌ని అన్నారు. అప్పుడే శ్రీదేవి మిస్ట‌ర్ ఇండియా స‌క్సెస్‌లో టాప్‌గా ఉంది. అంద‌రూ ఆమెను మిస్ ఇండియా అని అంటున్నారు. స‌రిగా ఆ స‌మ‌యంలోనే ఈ `ఆఖ‌రి పోరాటం` ఆఫ‌ర్ ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఆమె స‌రేన‌న్నా, నాగార్జున మాత్రం ఓకే చెప్ప‌లేదు. ఎందుకు చెప్ప‌లేదు అని అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అనుమానం. వెంట‌నే అశ్వ‌నీద‌త్ వెళ్లి నాగేశ్వ‌ర‌రావును క‌లిశారు. అప్పుడు ఏఎన్నార్ త‌న కుమారుడు నాగార్జున‌ను పిలిచి `ఆమె చాలా పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఆమెతో నువ్వు సినిమా చేస్తే త‌ప్ప‌కుండా ఆ పాపులారిటీ నీక్కూడా వ‌స్తుంది` అని అన్నార‌ట‌. తండ్రి మాట‌కు ఎదురుచెప్ప‌కుండా ఓకే అన్నార‌ట నాగార్జున‌. అప్పుడు నాగేశ్వ‌ర‌రావు ఇచ్చిన స‌ల‌హా నాగార్జున కెరీర్‌లో అలా ఉప‌యోగ‌ప‌డింద‌న్న‌మాట‌.