పచ్చని చిలుకలు తోడుండే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయీ.. అనే పాటను వినగానే ఎవరికైనా భారతీయుడు సినిమా ఇట్టే గుర్తుకొచ్చేస్తుంది. కమల్హాసన్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో నటించిన సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఆణిముత్యం. అప్పట్లో కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు గత కొంతకాలంగా ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తెలుగు నిర్మాత దిల్రాజు ఈ ప్రాజెక్ట్ లో ముందు అసోసియేట్ అయి, తర్వాత పక్కకు తప్పుకొన్నారు. ఇటీవల కూడా `ఆ సినిమాలో మనం లేం. మనం చేయడం లేదు` అని ప్రెస్ ముందు బాహాటంగానే చెప్పారు.
అయితే తాజాగా `ఇండియన్2`కి సంబంధించి స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయట. మూడు గంటల పాటు శంకర్ కథను నెరేట్ చేశారట. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కమల్ కాస్త వెయిట్ లాస్ అవుతున్నారట. ఈ విషయాలన్నిటినీ ఆ చిత్రానికి కెమెరామేన్గా పనిచేయబోయే రవి వర్మన్ వెల్లడించారు. ఈయన ఇటీవల బాలీవుడ్లో `సంజు` చిత్రానికి కూడా పనిచేశారు. తన ఎదుగుదలకు కమల్హాసన్ ప్రధాన కారణమని వెల్లడించారు రవివర్మన్.
శంకర్ ప్రస్తుతం `రోబో2` పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంత బిజీలోనూ `ఇండియన్2` సినిమా కథను శంకర్ ఎలా లాక్ చేయగలిగారని అందరూ విస్తుపోతున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఆ సమయంలోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే కమల్ రాజకీయాలతో బిజీ అయితే ఈ ప్రాజెక్ట్ మరింత డిలే అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే సినిమాను చేసేయడానికి శంకర్ అన్నివిధాలా తొందరపడుతున్నారన్నది కోలీవుడ్ న్యూస్.