సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఢీ కొట్టబోతున్నారా? హీరోలిద్దరు బాక్పాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారా? మరోసారి టాప్ స్టార్ల మధ్య వార్ తప్పదా? అంటే అవుననే సంకేతాలందుతున్నాయి. ఈ ఏడాది సంక్రాతికి ఇద్దరు హీరోలు పోటీ పడిన సంగతి తెలిసిందే. బన్నీ నటించిన అల వైకుంఠపురములో…మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటా పోటీగా ఆడాయి. రెండు సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. దీంతో అంతిమంగా బాక్సాఫీస్ విన్నర్ ఎవరు? అన్న దానిపై రెండు సినిమా యూనిట్లు ఎవరికి వారు గొప్పలు పోయారు. మా హీరో నే టాప్ అంటూ ఎవరికి వారు భజన చేసుకున్నారు.
పోటా పోటీగా సక్సెస్ మీట్లు…వసూళ్ల వివరాలు వెల్లడిస్తూ టాలీవుడ్ వాతావరణాన్ని వేడెక్కించారు. మహేష్- బన్నీ కామెంట్లు సైతం అభిమానులను అంతే వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఇద్దరు హీరోలు 2021 సంక్రాంతి పోరుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక ఇటీవలే మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సర్కార్ వారి పాట టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
గీతగోవిందం సక్సెస్ తో స్వింగ్ లో ఉన్న పరశురాం మహేష్ కు మరో సక్సెస్ ఇస్తాడనే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమాలేవి చిత్రీకరణలో లేవు. ప్రభుత్వం అనుమతులిచ్చి నేపథ్యంలో ఈనెలలోనే షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి. దీంతో పుష్ప, సర్కార్ వారి పాట చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేయాలని రెండు సినిమా యూనిట్లు భావిస్తున్నాయట. అదీ సంక్రాంతి వేదికైతే వసూళ్ల పరంగాను కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నారుట. అయితే పుష్ప ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తామని రివీల్ చేసారు. ఇంతలో సర్కార్ వారి పాట కూడా సంక్రాంతి రేసులో నిలవడంతో బన్నీకి పోటీగానే మహేష్ దిగుతున్నాడా? అన్న చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది.