బాల‌య్య ప‌క్క‌న పాయ‌ల్ రాజ్ పుత్?

                                                              (ధ్యాన్) 

పాయ‌ల్ రాజ్ పుత్ ఇండ‌స్ట్రీకి రావ‌డం కాస్త ఆల‌స్య‌మైందేమోగానీ, అవ‌కాశాల‌ను మాత్రం జెట్ స్పీడ్‌లో అందుకుంటోంది. అందుకు త‌గ్గ‌ట్టు ఎక్క‌డా సిగ్గుప‌డ‌కుండా, బోల్డ్ గానూ న‌టిస్తోంది. దాంతో ఇంక చేతినిండా అవ‌కాశాలే అవ‌కాశాలు. అన్ని అవ‌కాశాలున్నా కూడా తొంద‌ర‌ప‌డి వేటికీ సంత‌కం చేయ‌డం లేదు ఈ సుంద‌రి. అయితే ఇప్పుడు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. పాయ‌ల్‌కి ఇటీవ‌ల బ‌డా నిర్మాత సి.క‌ల్యాణ్ అడ్వాన్స్ ఇచ్చాడ‌ట‌. సో ఇప్పుడు సి.క‌ల్యాణ్ చేయ‌బోయే సినిమా `ఎ.కె.47`. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అంటే ఇప్పుడు పాయ‌ల్ రాజ్ పుత్‌కి అడ్వాన్స్ ఇచ్చింది ఈ సినిమా కోస‌మేన‌ని టాక్‌.  వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింద‌న‌మాట పాయ‌ల్. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న‌ది ప్ర‌శ్నార్ధ‌కంగానే ఉంది. 

బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేయాల్సి ఉంది. వారాహి చ‌ల‌న‌చిత్రం తెర‌కెక్కించే ఆ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. అంటే వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకున్న‌ట్ల‌యితే `య‌న్.టి.ఆర్‌` త‌ర్వాత బాల‌య్య హుటాహుటిన బోయ‌పాటి సినిమాకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ లెక్క‌న చూసుకున్నా వినాయ‌క్ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతుంది. అలా కాకుండా అహ‌ర్నిశ‌లూ క‌నుక బాల‌య్య క‌ష్ట‌ప‌డితే అప్పుడు మాత్ర‌మే అటు బోయ‌పాటి సినిమా, ఇటు వినాయ‌క్ సినిమా రెండూ ఒకేసారి సెట్స్ మీద ఉంటాయి. అదే జ‌రిగితే బాల‌య్య‌కు సెట్స్ మీద రెండు సినిమాలు చాలా ఏళ్ల త‌ర్వాత ఉన్న‌ట్టు అర్థం. మ‌రే స్టార్ హీరోకీ రెండు సినిమాలు ఒకేసారి లేవ‌న్న‌దీ అంగీక‌రించాల్సిన వాస్త‌వం.