క్వీన్ కంగన రనౌత్ కెరీర్ జర్నీలో వివాదాల గురించి తెలిసిందే. తనతో పని చేసే హీరోలు.. దర్శకనిర్మాతలు సహా రచయితలతోనూ నిరంతరం ఏదో ఒక గొడవ పడడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన తాజా చిత్రం `జడ్జిమెంటల్ హై క్యా` ప్రమోషన్స్ లో జర్నలిస్టులతోనూ గొడవ పెట్టుకున్న కంగన ఆ వివాదంలో మొండి పట్టు పెట్టి కోర్టుల వరకూ వెళ్లిన సంగతిని మర్చిపోలేదెవరూ. ప్రస్తుతం కంగనపై జర్నలిస్టుల గిల్డ్ సీరియస్ గా ఉందన్న ప్రచారం ఉంది.
ఈ వివాదాలు `జడ్జిమెంటల్ హై క్యా` చిత్రానికి ప్రచారం పరంగా కలిసొచ్చాయనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 25కోట్ల మేర షేర్ వసూలు చేసి చక్కని వసూళ్లతో దూసుకెళుతోంది. `మణికర్ణిక` తర్వాత కంగన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంలోనే క్వీన్ తదుపరి సినిమాలపైనా దృష్టి సారిస్తోంది. త్వరలోనే ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో `జయలలిత బయోపిక్` ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అలాగే పంగ అనే క్రీడా నేపథ్యంలోని సినిమాను కంగన చేస్తోంది. ప్రస్తుతం కంగన తన స్వస్థలం మనాలికి వెళ్లింది. అక్కడ కొంతకాలం పాటు రిలాక్స్ అవుతుందట. మనాలీలో నిర్మించిన భారీ భవంతి `మిరేజ్` గ్యారేజ్ లోకి ఓ కొత్త లగ్జరీ కార్ వచ్చి చేరింది. దీనిని కానుకగా ఇచ్చింది ఎవరో తెలుసా? తన సోదరి రంగోలి చందేల్. మంచు పర్వత సానువుల్లో ఉన్న మనాలీలో కంగనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్ ని కానుకగా ఇచ్చిందట. మెర్సిడెస్ జీఎల్ఇ కార్ ఖరీదు 77.82 లక్షలు అని తెలుస్తోంది. వరుస సక్సెస్ లతో జోరు మీద ఉన్న కంగనకు సోదరి రంగోలి ఇచ్చిన స్వీట్ సర్ ప్రైజ్ ఇదని చెబుతున్నారు. మొత్తానికి కాంట్రవర్శీ క్వీన్ కంగనకు సోదరి రంగోలి గొప్ప అండ అనడంలో సందేహం లేదు.
