స్టైల్ మార్చిన సురేంద‌ర్‌రెడ్డి

సురేంద‌ర్‌రెడ్డికి స్టైలిష్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరుంది. అయితే త‌ను రూపొందించే చిత్రాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను క‌థ‌ని అందించ‌లేదు. తొలి చిత్రం `అత‌నొక్క‌డే` చిత్రాన్ని మిన‌హాయిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అశోక్‌, అతిథి, కిక్‌, ఊస‌ర‌వెల్లి, రేసుగుర్రం వంటి చిత్రాల‌కు కేవ‌లం స్క్రీన్‌ప్లేని మాత్ర‌మే అందించాడు. వీట‌న్నింటికీ వక్కంతం వంశీ క‌థ అందించాడు.

ఇన్నేళ్ల త‌రువాత సురేంద‌ర్‌రెడ్డి స్టైల్ మార్చి త‌న నెక్స్ట్ చిత్రానికి క‌థ రాస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవితో తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా `సైరా న‌ర‌సింహారెడ్డి`ని తెర‌కెక్కించిన సురేంద‌ర్‌రెడ్డి త‌రువాత చిత్రాన్ని స్టార్ హీరోతో చేయాల‌ని ఎదురుచూశాడు కానీ ఎవ‌రూ ఖాలీగా లేక‌పోవ‌డంతో అక్కినేని వార‌బ్బాయి అఖిల్ కోసం క‌థ రాస్తున్నార‌ట‌.

అఖిల్ ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ పూర్తియిన త‌రువాతే సురేంద‌ర్‌రెడ్డి చిత్రం సెట్స్‌పైకి రానుంద‌ట‌. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.