
హితం చెప్పేదే సాహిత్య అంటారు మహా కవులు . కడుపు నింపేదే సాహిత్యం అంటారు నేటి తరం కవులు . సాహిత్యానికి సమాజాన్ని మార్చే శక్తి ఉందొ లేదో కానీ సమాజంపై అమితమైన ప్రభావం మాత్రం చూపిస్తుందని చెప్పవచ్చు . . ఇక సాహిత్యం ,సినిమా సాహిత్యం గురించి మాట్లాడుకోవాలంటే , సినిమాలో వచ్చే వెర్రిమొర్రి మాటలు , అర్ధంలేని పాటలు సాహిత్యం ఎలా అవుతుందని అనేవారు ఎక్కువ మంది వున్నారు .
ఇక సినిమా పాటలు ఇప్పుడు మాటల కన్నా ఘోరంగా వుంటున్నాయనేవారు వున్నారు . సినిమా పాటలు వ్రాయడానికి పాడిత్యం అవసరం లేదనేవారు కూడా వున్నారు . తెలుగు సినిమా 1931 నుంచి మాట్లాడటం మొదలు పెట్టింది . మొదట్లో పౌరాణిక ముద్ర వున్నా ఆ తరువాత సాంఘిక చిత్రాల నిర్మాణం ప్రారంభమైంది . అప్పటి సాంఘిక సమస్యలపై ధ్వజం ఎత్తుతూ తీసిన సినిమాలు వున్నాయి . అందులో రైతు బిడ్డలాంటి సినిమాలు నిషేదానికి గురయ్యాయి . సినిమాల్లో పాటలు రాయడం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు . పాట సినిమాలో అంతర్భాగంగా ఉండాలి , పాత్రోచితంగా ఉండాలి, ప్రభావితం చెయ్యాలి . అంతే తప్ప సినిమా కథకు, సందర్భానికి సంబంధం లేకుండా వుండకూడదు .
నిజానికి ఆనాడు ఉద్దండులైన కవులు సినిమా రంగంలో ప్రవేశించి సాహిత్యాన్ని సృష్టించగలిగారు కాబట్టే నేటికీ అవే పాటలు బతికి వున్నాయి . పాటకు మనసును ప్రభావిత చేసే శక్తి ఉందని నాటి మహాకవులు నిరూపించారు . సాహిత్యంలో ఉద్దండులైన దేవులపల్లి కృష్ణ శాస్త్రి , మహాకవి శ్రీ శ్రీ , ఆరుద్ర , దాశరధి , డాక్టర్ సి. నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి వారు వున్నారు . బలిజేపల్లి లక్ష్మి కాంత కవి, ఆత్రేయ, కొసరాజు, సముద్రాల రాఘవాచార్యులు , పింగళి నాగేంద్ర రావు తదితరులు వున్నారు .
తెలుగు సినిమాలో సుసంపన్నమైన సాహీతీ పంటలను వీరు పండించారు . అయితే అప్పుడు కూడా సినిమా సాహిత్యంలో విపరీత ధోరణులు మొదలయ్యాయి . దీనిపై మహాకవి ఆరుద్ర స్పందించాడు .” గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకు ?” అన్నాడు . ఈ ఒక్క మాటలో ఎన్నో అర్ధాలు వున్నాయి . ఆరుద్ర రాసిన పాటలు ఇప్పటికీ ఆణిముత్యాలే . ఆయన మనకు అందించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం చాలు ఆయన తరతరాలు నిలబడటానికి . అల్లాంటి ఆరుద్ర సాహిత్యంపై మాట్లాడుతూ , “వ్యాపార సాహిత్య, ప్రయోజనకరమైన సాహిత్య, మరొక సాహిత్య అని వుండవు . సాహిత్యంలో సత్తా ఉంటే అది పది కాలాలు బతుకుతుంది . ప్రజల మనస్సులో సుస్థిరంగా ఉండేదే నిజమైన సాహిత్యం . అదే కొలమానం ” అన్నారు .
పందిట్లో పెళ్లవుతున్నది , కనువిందువుతున్నాది , కొండగాలి తిరిగింది , గుండె వూసులాడింది , మనసే అందాల బృందావనం , అమ్మకడుపు చల్లగా , అత్త కడుపు చల్లగా లాంటి పాటలు ఆరుద్ర ను సజీవంగా మన ముందు నిలబెడతాయి . కలం పట్టుకుంటే ఆరుద్ర ఆ రుద్రుడే అంటారు !
