గాన గాంధర్వ కోకిల . . నవరసాల గాయని సుశీల

1953వ సంవత్సరం . నిర్మాత , నటుడు, దర్శకుడు కెఎస్ ప్రకాశం రావు తన ప్రకాష్ స్టూడియోస్ పతాకంపై ఓ సినిమా నిర్మించడానికి సంకల్పించాడు . కథ తయారైపోయింది , వరలక్ష్మి, నాగేశ్వర రావు తదితరులను ఎంపిక చేసుకున్నాడు . సంగీత  దర్శకుడుగా పెండ్యాల నాగేశ్వర రావును నియమించాడు . ఈ సినిమాలో ఓ కొత్త గాయానికి పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యం ఉందని ప్రకాష్ రావు పెండ్యాలకు చెప్పాడు .

పెండ్యాల కొత్త గాయని వేటలో పడ్డాడు . అప్పుడు మద్రాస్ అల్ ఇండియా రేడియోలో న్యాపతి రాఘవ రావు దంపతులు బాలానందం అనే కార్యక్రమం నిర్వహిస్తుండేవారు . అందులో పిల్లతో పాటలు పాడిస్తూ ఉండేవారు . పెండ్యాలకు ఆ విషయం గుర్తుకు వచ్చి సరాసరి రేడియో స్టేషన్కు వెళ్లి రాఘవ రావు ను కలసి వచ్చిన పని చెప్పాడు . రాఘవ రావు ఐదు మంది గాయనీమణులు  ఇచ్చాడు .

పెండ్యాల ఆ ఐదు మందిని పిలిపించి పాటలు పాడించాడు . ఆ ఐదుగురిలో పెండ్యాలతో పాటు కేఎస్ ప్రకాశరావుగారికి ఓ అమ్మాయి గొంతు బాగా నచ్చింది . ఆఅమ్మాయికి 16 సంవత్సరాలు ఉంటాయి .ఆ గొంతులో మాధుర్యం వారిని బాగా ఆకట్టుకున్నది . ఆ అమ్మాయిని “కన్న తల్లి ” అనే చిత్రంలో గాయనిగా పరిచయం చేశారు . ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు . ఆ గాయని పి . సుశీల .

అప్పటి నుంచి ఇప్పటి  వరకు అనేక భాషా చిత్రాల్లో 40,000 పాటలకు పైగా పాడారు . తనదైన ముద్ర పాటల మీద వేశారు . సంగీత ప్రపంచంలో  గాన కోకిల సుశీల . ఆమె ఎక్కని మెట్లు లేవు , సాధించని విజయాలు లేవు . సంగీత ప్రియులంతా సుశీల ను స్మరించుకుంటున్నారు . జీవితాన్ని సంగీతంతో పండించుకున్న సుశీల నిజంగా కారణ జన్మురాలే ..!