పార్టీ మారుతున్న కార్యకర్తను బెదిరించిన టిఆర్ఎస్ వీరేశం భార్య (ఆడియో టేపు)

నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం భార్య వేముల పుష్ప పార్టీ మారిన కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. తాజాగా చిట్యాలకు చెందిన సతీష్ అనే కార్యకర్త పార్టీ మారుతుండగా అతనికి ఫోన్ చేసి పుష్ప బెదిరించిన ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప ఏమని బెదిరించిందంటే…

“తమ్మీ సతీష్.. నీవు జాగృతి పేరు చెప్పుకొని ఏం ఏం కథలు పడ్డవు.. ఏడ ఏడ వసూలు చేసినవో అన్ని ఎరుకే.. కవితక్కా దాక తెలుసు. ఒక్కొక్కడు పోయిండు… మళ్లీ సంక్క నాక్కుంటా వచ్చి చైర్మన్లు అయ్యిర్రు. అందరి కథలు తెలుసు.. మళ్లీ గెలిచేది వీరేశం అన్నే.. కేసీఆరే సీఎం.. ఏడికి పోతవు తమ్మి నువ్వు చిట్యాలనేగా ఉండేది.. పో తమ్మి పో… “ అంటూ పుష్ప కార్యకర్తను బెదిరించింది.  

మరి కొందరు కార్యకర్తలను కూడా  ఈ విధంగానే బెదిరిస్తున్నారని కార్యకర్తలు వాపోయారు. మీడియాలో కూడా ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయం పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. వీరేశం భార్య పుష్ప పార్టీ మారుతున్న కార్యకర్తలను బెదిరించడం సరికాదన్నారు. ఎవరికైనా రాజ్యాంగం ప్రకారం పార్టీలు మారే హక్కు ఉంటుందన్నారు. అయినా ఇటువంటి బెదిరింపు రాజకీయాలు సరికావన్నారు. నకిరేకల్ లో తమకు ఎదురే లేదంటూ విర్ర వీగుతున్నారని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ దీనిని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని వారు కోరారు.  ఓ ఛానల్ లో ప్రసారమైన ఆడియో టేపు కింద ఉంది మీరూ వినండి.

https://www.youtube.com/watch?v=KglJfrTsa-0&feature=youtu.be