(శ్రవణ్ బాబు)
పెన్షన్లు – కరెంట్ అనే రెండు అంశాలే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రధాన అస్త్రాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి తీసుకొచ్చే ఓట్లను తలదన్నేలా మూడు వర్గాల ఓట్లు టీఆర్ఎస్ కు దెబ్బ కొడతాయా అనే చర్చ ఒకటి నడుస్తూ ఉంది ఎన్నికల పండితుల మధ్య. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు అనే ఈ మూడు వర్గాలు టీఆర్ఎస్ పేరు చెబితేనే భగ్గుమంటూ మండిపతూ ఉండటమే దీనికి కారణం.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది యువత, ఎన్జీవోలు, జేఏసీలు అన్న సంగతి అందరికీ విదితమే. వివిధ కారణాలవల్ల ఈ వర్గాలన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యాయి. ఈ కారణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
అధికారంలోకి రాగానే లక్షా పాతికవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నాలుగున్నర ఏళ్ళ తర్వాత చూస్తే పట్టుమని పాతికవేల ఉద్యోగాలుకూడా ఇవ్వలేదు. ఖాళీలయితే పుష్కలంగా ఉన్నాయి. దానికితోడు కేసీఆర్ ఆర్భాటంగా పది జిల్లాలను అమాంతం 31కు పెంచటంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలలో, విభాగాలలో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్లయితే ఇచ్చారుగానీ వాటిలో అత్యధికశాతం భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి కారణం భర్తీ ప్రక్రియ నియమ నిబంధనలలో లోపాల వలనగానీ, విధివిధానాలలో తప్పులవలన గానీ కొందరు అభ్యర్థులు కోర్టులకు వెళ్ళటంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. దీనికి కారణం ప్రభుత్వ అసమర్థతే. సర్వీస్ కమిషన్ కు అనుభవజ్ఞులైన, సమర్థులైనవారిని నియమిస్తే పని సజావుగా సాగేది. ప్రభుత్వం ఛైర్మన్ పదవికి నామినేట్ చేసిన ప్రొఫెసర్ చక్రపాణి వ్యవహారశైలిపై అనేక విమర్శలు బలంగా వినబడ్డాయి. అయినాకూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవటంగానీ, సర్వీస్ కమిషన్ కు సమర్థులను నియమించటంగానీ చేయలేదు.
భర్తీ ప్రక్రియలకు కీలకంగా భావించే జోనల్ విధానాన్ని గులాబీ బాస్ నాలుగేళ్ళూ పట్టించుకోకుండా వదిలేయటంకూడా మరో ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ఎట్టకేలకు నిద్రలేచి ఈ ఏడాది జులైలో ఢిల్లీ వెళ్ళి ఆమోదముద్ర వేయించుకొచ్చారు.
మరోవైపు, కొత్త ప్రభుత్వం రాగానే ఉద్యోగ నియామకాలు త్వరత్వరగా జరుగుతాయని ఊహించుకుని పల్లె ప్రాంతాల నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు హైదరాబాద్ నగరంలో రూములు తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టారు. లైబ్రరీల్లో, రీడింగ్ రూముల్లో ఎక్కడ చూసినా ఉద్యోగార్థులైన అభ్యర్థులే. రు.5 ప్రభుత్వ భోజనం తిని, చెట్లకింద కూర్చుని కష్టపడి తాము ఒకపక్క ప్రిపేర్ అవుతుంటే, భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోవటంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. కేసీఆర్ పేరు చెబితేనే ఒంటికాలుమీద లేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులుకూడా కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు. గత వేసవికాలంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను కేసీఆర్ కఠినంగా అణచివేయటం, తమ డిమాండ్లను కనీసం పట్టించుకోకపోవటంతో వారుకూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ అమలు చేయాలన్నది వారి డిమాండ్. 2013నాటి పీఆర్సీ కాలపరిమితి 2017 మార్చి 31తో ముగిసి ఏప్రిల్ 1నుంచి కొత్త వేతనాలు అమలు కావాల్సి ఉన్నప్పటికీ, పదిహేను నెలలుగా ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటంలేదంటూ జూన్ 11నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. దీనిపై కేసీఆర్ కస్సుమన్నారు. సమ్మె విరమించకపోతే ఇదే ఆఖరి సమ్మె అవుతుందంటూ, ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తానని పరోక్షంగా హెచ్చరించారు. ఇరువర్గాలూ తీవ్రస్థాయిలో పట్టుపట్టుకుని కూర్చోగా, హరీష్ రావు, కేటీఆర్ కలిసి పంచాయతీ చేసి ఆర్టీసీ ఉద్యోగులతో సమ్మె విరమించినట్లు ప్రకటింపజేశారు. కానీ ఉద్యోగులలో అధికశాతంమంది మాత్రం ఆ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఇప్పటికీ మర్చిపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య 56 వేలు.
ఇదిలాఉంటే ఈ మూడువర్గాలు కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని మరోవర్గంనుంచి కూడా కొంతమేర తెరాసకు వ్యతిరేకంగా ఓట్లుపడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షలమంది ఉన్న కౌలురైతులు దాదాపు 65శాతం వ్యవసాయభూమిని సాగుచేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో అత్యధికశాతం కౌలురైతులేనని గణాంకాలు చెబుతుంటాయి. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున ఇచ్చే కేసీఆర్ రైతుబంధు పథకం వీరికి మొండి చెయ్యి చూపింది. మరోవైపు నలభై, యాభై ఎకరాలు ఉన్న బడా భూస్వాములకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయటం ఒక విచిత్రం.
ఇకపోతే, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆంధ్రోళ్ళ కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తానన్న కేసీఆర్ మళ్ళీ ఇటీవల జిల్లాలలో ఎన్నికల సభలలో వారిపై విరుచుకుపడటంకూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక వ్యతిరేకాంశంగానే చెప్పుకోవాలి. కూకట్ పల్లిలాంటి ప్రత్యేకమైన స్థానంలో సెటిలర్స్ లోని కొంతమంది టీడీపీతో ఉన్న వ్యతిరేకత కారణంగా టీఆర్ఎస్ కు వేసినా, మిగిలిన చోట్ల టీఆర్ఎస్ కు ఓటువేసే అవకాశాలు మృగ్యమనే చెప్పాలి. మరి ఈ ప్రతికూలాంశాలు టీఆర్ఎస్ విజయావకాశాలను ఏ మేర దెబ్బతీస్తాయనేది తెలియటానికి మరో వారం రోజులు ఆగాలి.
(రచయిత హైదరాబాద్ లో ఉండే సీనియర్ జర్నలిస్టు, ఫోన్ నెం 99482 93346)
