పెద్దపల్లి లోక్ సభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

(లక్ష్మణ్ విజయ్)

ప్రజాగాయకుడు గద్దర్ విప్లవ రాజకీయాల్లోనుంచి ఎన్నికల రాజకీయాల్లోకి వస్తున్నారు. నిజానికి ఈ పార్లమెంటరీ పంథాలోకి మారి  చాలా కాలమయింది. కాకపోతే, ఎన్నికల్లో పోటీ చేయలేదు.  అయితే, ఆయన ఎన్నికల్లో నిలబడేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఆయన్నేదో విధంగా ఎన్నికల్లోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. గద్దర్ ఇంతవరకు  ప్రజాసంస్థలు లేదా ఇంత అభ్యుదయ వాదులు ఏర్పాటు చేసిన వేదికల మీద ప్రసంగించడం, వాటితో కలసి పనిచేయడం జరుగుతూ వచ్చింది. ఆయనే సొంతంగా పార్టీ ఏర్పాటుచేస్తారని కూడా అనుకున్నారు. అయితే, పార్టీ ఏర్పాటుచేయడం, లేదాచిన్న చిన్న సంస్థలలతో పనిచేయడం అన్నీ మూన్నాళ్ల ముచ్చటల్లే ఉంది కాబట్టి ఆయన ఎన్నికల్లో నిలబడేందుకు ఒక  ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తున్నారు. ఈ మార్గాన్ని కాంగ్రెస్ చూపించబోతున్నది.

ఒకసీనియర్ కాంగ్రెస్ నాయకుడు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పిందాని ప్రకారం గద్దర్ ని కాంగెస్ తరఫున పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇవి పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శి అయిన కె. రాజు (మాజీ ఐఎఎస్ అధికారి) అధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏమయినా సరే ఆయనను కాంగ్రెస్ తరఫున నిలబెట్టాలని, ఆయనను ఒప్పించాలని రాజు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను పురమాయించారు. రాజుకు గద్దర్ కు చాలా మంచి స్నేహం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఐ ఎఎస్ అధికారిగా ఉన్నపుడు, గద్దర్ మీద నిషేధం కొనసాగుతున్నపుడు రాజు గద్దర్ తో  స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇప్పించారు. స్వయం ఉపాధి సంఘాలకు పాట ప్రచారం సాధనమయంది కూడా గద్దర్ స్ఫూర్తితోనే.  ఇపుడు రాజు కాంగ్రెస్ పార్టీలో చాలా బాధ్యతాయుతమయిన హోదాలో ఉండటంతో గద్దర్ ని ఎన్నికల్లో పోటీచేయించేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం అందింది.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ని, ఆయనకు ప్రభుత్వం ప్రాబల్యాన్ని, ధన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చిన్న చిన్న పార్టీలు చాలవని గద్దర్ కు కాంగ్రెస్ నచ్చ చెబుతూ ఉంది. అందువల్ల అలాంటి ప్రయత్నాలు విరిమించుకుని కాంగ్రెస్ నుంచి  పోటీచేసేలా ఒప్పించాలని చూస్తున్నది.రాజు నేరుగా గద్దర్ సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఎక్కడి నుంచి పోటీ…

రెండుమూడు నియోజకవర్గాలను అనుకున్నప్పటికి  పెద్దపల్లి ఎస్ సి నియోజకవర్గం నుంచి గద్దర్ ను పోటీ చేయించేందుకు చూస్తున్నారు.  గత సారి కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి జి. వివేక్ పోటీ చేసి వోడిపోయారు. వివేక్ మీద టిఆర్ ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నెగ్గారు. తర్వాత వివేక్ టిఆర్ ఎస్ లో చేరిపోయారు. అందువల్ల అక్కడి నుంచి పోటీ చేసేందుకు గద్దర్ అనువయిన వ్యక్తి అని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది.  తన అభిప్రాయం ప్రకటించాల్సింది గద్దరే. అవసరమయితే, రాహుల్ గాంధీతో కూడా గద్దర్ కి ఒక సమావేశం ఏర్పాటుచేయించాలని కూడా ాపార్టీ నేతలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినపుడు ఈ సమావేశం జరిగే వీలుంది.

విప్లవ రాజకీయాలనుంచి వచ్చి నేరుగా కాంగ్రెస్ లో చేరి, పోటీ చేయడానికి గద్దర్ సుముఖంగా లేని పక్షంలో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. గద్దర్ ని ఎలాగయినా ముందు రాజకీయాల్లోకి తీసుకురావాలని రాజు భావిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఒక మాజీ టిడిపి ఎంపి పేరును ఈ స్థానానికి సిఫార్సు చేసినా, ఆ పేరు మీద తుది నిర్ణయం గద్దర్ వ్యవహారం తెల్చిన తర్వాతే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలుతెలిపాయి.

మొదటి ప్రయారిటీ గద్దర్,  ఆతర్వాతే, మిగతా పేర్లు అని ఈ వర్గాలు చెప్పాయి.