IndiGo Airlines: గతవారం సుమారు 2,000 విమానాల రద్దు విషయం భారతదేశ విమానయాయన నెట్ వర్క్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తాను ఏకస్వామ్యాలను వ్యతిరేకిస్తానని.. ఒలిగోపోలి సృష్టిని, ఎంపిక చేసిన కొద్దిమంది చేతుల్లో ఆర్థిక శక్తి కేంద్రీకరణను వ్యతిరేకిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ పదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ సమయంలో అసలు ఏమిటీ డ్యూపోలి, ఒలిగోపోలి?
రాహుల్ గాంధీ చెప్పారని కాదు కానీ.. తాజా ఇండిగో సంక్షోభం నుంచి ఇండియా నేర్చుకోవాల్సింది ఏమిటి?
ఈ విషయంలో ఎవరి బాధ్యత ఎంత? ఎవరి నేరం ఎంత?
ప్రపంచ మార్కెట్ పై పెద్ద పట్టున్న ఇండిగోకు ఈ పరిస్థితి ఎందుకు?
వంటి ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతుండగా.. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందా..!

దేశంలో ఇండిగో సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో.. భారతదేశ విమానయాన నెట్ వర్క్ లో ఇప్పుడు ఇండిగోతో ఆదిపత్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఈ సమయంలోనే ఒలిగోపోలి (మార్కెట్ లో కొన్ని పెద్ద కంపెనీలు ఆధిపత్యం చెలాయించే పరిస్థితి!), డ్యూపోలి (ఒక మార్కెట్ లో కేవలం రెండు సంస్థలే ఉండి, ఆ మార్కెట్ లోని ఎక్కువ భాగాన్ని నియంత్రించడం!) వంటి విషయాలు తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
భారతదేశ దేశీయ మార్కెట్లో 64.2 శాతం ఇండిగో నియంత్రణలో ఉంది. ఇది ఎయిర్ ఇండియా వాటా 27.3 శాతం కంటే సుమారు రెండు రెట్లు ఎక్కువ. ఇలా వ్యవస్థలో ఎక్కువ భాగం ఒకే విమానయాన సంస్థపై ఆధారపడి ఉన్నప్పుడు.. దాని సమస్యలు అందరి సమస్యగా మారతాయనే విషయం తాజాగా ఇండిగో సంక్షోభంతో స్పష్టమిందనే చెప్పొచ్చు. ఒక సంస్థ వల్ల దేశం మొత్తం ఈ స్థాయిలో తడబడటం ఏమాత్రం సహేతుకం కాదనే చెప్పాలి.
ఇండిగో సంస్థవద్ద సుమారు 400 విమానాలు ఉన్నాయి. ఇది గత ఏడాది సుమారు 6.8 లక్షలకు పైగా దేశీయ విమానాలను నడిపింది. ఈ క్రమంలో సుమారు 10 కోట్లకు పైగా ప్రయాణికులు ఈ సంస్థ విమానాల్లో ప్రయాణించారన్నమాట. అదే ఎయిరిండియాలో కేవలం 2 కోట్ల మందే ప్రయాణించారని అంటున్నారు. అంటే… ఇండిగోలో ఏదైనా సంక్షోభం తలెత్తినా, జాప్యం జరిగినా అది దేశంలోని మరే ఇతర విమానయాన సంస్థలోని అంతరాయం కంటే చాలా ఎక్కువ అన్నమాట!

ప్రపంచదేశాల నుంచి ఈ విషయంలో మనం ఏమి నేర్చుకోవాలి?:
యునైటెడ్ స్టేట్స్ లో అమెరికన్ ఎయిర్లైన్స్ (21 శాతం), సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ (19 శాతం), డెల్టా ఎయిర్ లైన్స్ (18 శాతం), యునైటెడ్ ఎయిర్ లైన్స్ (16 శాతం) దేశీయ మార్కెట్ ను పంచుకుంటాయి. ఇదే సమయంలో.. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన చైనా కూడా మూడు ప్రభుత్వ యామజాన్యంలోని క్యారియర్లను, అనేక ఇతర ప్రైవెటు విమానాలను కలిగి ఉంది.
రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!:
ఇలా.. భారతీయ పౌరవిమానయాన రంగంలో ఏర్పడిన గుత్తాధిపత్యానికి కేంద్ర విధానాలే కారణమని, అందుకే ఇండిగోలాంటి సంస్థలు నిబంధనలను బేఖాతరు చేసి ప్రయాణికులను ఇబ్బందిపెడుతున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తోన్న వేళ.. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడంలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా… మరిన్ని విమానయాన సంస్థలను ఇందులోకి ఆహ్వానిస్తున్నామని తాజాగా తెలిపారు.
ఇలా తాజాగా కొత్త విమానయాన సంస్థలకు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడంతో.. ఇప్పటికైనా డ్యూపోలి, ఒలిగోపోలి వంటి పదాలు భారత విమానయాన నెట్ వర్క్ లో వినిపించకుండా ఉంటాయా.. లేదా ఇదే కొనసాగుతుందా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

