సిద్దిపేటలో హారీష్ రావు పై సంచలన కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇలాకాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసుకు సంబంధించి సిద్ధిపేట కోర్టుకు రేవంత్ రెడ్డి శనివారం హాజరయ్యారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“ నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం కేసీఆర్ కు అలవాటు. హరీష్ కు సిద్దిపేట ఈ సారే ఆఖరు మరొసారి టికెట్ రాదు. కొడుకుకు అడ్డం ఉన్నాడనే హారీష్ కు అవకాశాలు ఇవ్వటం లేదు. టిఆర్ఎస్ లో హారీష్ రావు ప్రాధాన్యత తగ్గినట్టే. హారీష్ కు బహూశా ఇదే ఆఖరి అవకాశం. మళ్లీ టిఆర్ఎస్ టికెట్ దక్కేది అనుమానామే. ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ అది కూడా జరగదు. ఒక వేళ అవకాశం కల్పిస్తే హారీష్ కు తెలంగాణలో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎటు తిరిగి హారీష్ ను ఇరకాటంలో పెట్టే పని చేస్తారు.

16 మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడుతామని అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఎంపీలతో ఏం సాధించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చారా, విభజన హామీలు ఇచ్చారా అసలు  ఏం సాధించారని 16 మంది ఎంపీలని గెలిపిస్తారని అనుకుంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీగానే సాగుతాయి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అడ్రస్ లేకుండా పోయింది. 16 మంది ఎంపీలను గెలిపించుకోవటమే ఆయన లక్ష్యమైంది.” అని  రేవంత్ రెడ్డి అన్నారు.

సిద్దిపేటలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గతంలో కూడా హారీష్ రావుకు మంత్రి పదవి దక్కదని రేవంత్ రెడ్డి అన్నారు. అదే విధంగా హరీష్ రావు కు మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం హరీష్ కు టికెట్ దక్కదని వ్యాఖ్యలు చేయడంతో ఇది కూడా నిజమే అవుతుందా అని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.