తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అరెస్టుకు మనస్థాపంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నాయుడు పేటకు చెందిన రాజా అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అభిమాని. రేవంత్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకొని రాజా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేగింది. రాజా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడైన రేవంత్ రెడ్డికి పిచ్చి అభిమాని అని స్థానికులు తెలిపారు. రాజా.. రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పట ి నుంచి అభిమానిగా ఉన్నాడని.. రేవంత్ ను టైగర్ అని రాజా పిలిచేవారని వారన్నారు.
రాజా.. నాయుడు పేట పట్టణంలోని విన్నమాల రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతను బైక్ పంచర్ల దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టు వార్త టివిలో చూశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన రాజా పెట్రోల్ బంక్ కు వెళ్లి బాటిల్ లో పెట్రోలు తీసుకున్నాడు. అతని దుకాణం దగ్గరకు వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలల్లో రాజా కాలిపోతుండడంతో గమనించిన చుట్టు పక్కల వారు మంటలను ఆర్పారు. 108 వాహనంలో నెల్లూరు తరలించారు.

రేవంత్ రెడ్డి అరెస్టు వార్త తెలిసినప్పటి నుంచి డల్ గా ఉన్నాడని ఉదయం చాయ్ కూడా తాగకుండా వెళ్లాడని బాధితుని భార్య తెలిపింది. రేవంత్ రెడ్డి అంటే పిచ్చి అభిమానమని ఆయన స్పీచ్ లను పదే పదే వింటుంటాడని అమె తెలిపింది. ఇంట్లో కూడా రాజా రేవంత్ లాగా మాట్లాడుతాడని, ఆయన దైర్యంతో నేను బతుకుతున్నానని చెప్పేవాడని రాజా భార్య తెలిపింది. రాజాకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
కొడంగల్ లో మంగళవారం ఉదయం హైడ్రామా మధ్య పోలీసులు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుకు నిరసనగా మంగళవారం కొడంగల్ బంద్ కు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన కొడంగల్ లో ఉంది. దీంతో కేసీఆర్ సభను అడ్డుకునే కుట్రలో భాగంగా రేవంత్ కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారని నియోజకవర్గ నేతలు ఈసికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో పోలీసులు రేవంత్ పై కేసు నమోదు చేశారు. కేసీఆర్ సభకు అనుమతులున్నాయని సభను అడ్డుకోవద్దని పోలీసులు రేవంత్ ను కోరారు.

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చేరుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం అరెస్టు చేయమని చెప్పిందా అని రేవంత్ పోలీసులను నిలదీశారు. ఎన్నికల సంఘం ఏం చెప్పలేదని సభను అడ్డుకోవద్దని ఆదేశించిందన్నారు.
కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని అందుకే అరెస్టు చేస్తున్నామని పోలీసులు రేవంత్ కు తెలిపారు. దీంతో రేవంత్ తాను రానని చెప్పడంతో పోలీసులు రేవంత్ ను బలవంతంగా ఎత్తకెళ్లి పోయారు. జడ్చర్లలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు రేవంత్ ను పోలీసులు తరలించారు.

రేవంత్ అరెస్టు పై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ అరెస్టును నేతలంతా ఖండించారు. ఈసీ ఆదేశాలతో రేవంత్ ను పోలీసులు భారీ భద్రత మధ్య కొడంగల్ కు తరలించారు. దీంతో రేవంత్ అరెస్టు ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని హైకోర్టు పోలీసుల పై మండిపడింది. తెలంగాణ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి అంతలా వ్యవహారించాల్సిన అవసరమేముంది అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు రేవంత్ విడుదలతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరులో రాజా ఆత్మహత్యాయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేవంత్ పోలీసు నిర్బందంలో ఉన్నప్పుడు ఈ విషయం తెలిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆంధ్రా పోలీసులు మీడియాకు తెలియనివ్వలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
