తెలంగాణలో బలపడుతున్న బీజేపీ.. నంద్యాల సీన్ రిపీట్ అవుతోందా?

2019 ఎన్నికలకు ముందు ఏపీలోని నంద్యాలలో ఉపఎన్నిక జరగగా నంద్యాలలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ ఉపఎన్నిక ఫలితాలు మాత్రం టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. ఒక్క రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలో టీడీపీ విజయం సాధించింది. అయితే ఉపఎన్నికలో టీడీపీ విజయం సాధించినా 2019 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. తెరాస మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించినా ఈ విజయం నైతిక విజయం అని ఎవరూ అంగీకరించడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున విజయం సాధించాలని భావించారు. అయితే తెరాస ఎంట్రీతో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ ఇకపై ఇప్పటివరకు జరిగిన తప్పులపై దృష్టి పెట్టి బలపడితే 2024లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కష్టమేం కాదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని ప్రజల్లోకి సైతం సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ తెరాస మెజార్టీకి దెబ్బేసిందని కేటీఆర్ కామెంట్ చేశారంటే ఉపఎన్నిక ఫలితం ఆయనను ఏ స్థాయిలో టెన్షన్ పెట్టిందో సులువుగానే అర్థమవుతుంది.

మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి ఒకింత షాక్ ఇచ్చినా రాష్ట్రంలో గెలవాలంటే జాగ్రత్త పడాలని గుర్తు చేశాయి. ఉపఎన్నిక ఫలితం ముందే ఊహించారు కాబట్టి ఓటమి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఆశ్చర్యానికి గురి కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వల్ల బీజేపీ నేతలు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు.