తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇచ్చిన చాలా హామీలు ప్రజల్లోకి వెళ్ళినా సరే వాటిని అమలు చేసే విషయంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రధానంగా ఆసరా పింఛన్ల విషయుంలో ఇప్పుడు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. కొత్త పెన్షన్ లు ఏవి ఇప్పుడు జిల్లాల్లో నమోదు కావడం లేదని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారని కొత్త వారికి పెన్షన్ లను నమోదు చేసే విషయంలో అధికారులు విఫలమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ దీని మీద ఎక్కువగా దృష్టి సారించారని సమాచారం. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కమిటీలో ఇద్దరు మంత్రులు అధికారులు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గ్రామస్థాయిలో కొంతమంది అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.దీంతో ఎవరైతే పెన్షన్లను నమోదు చేసే విషయంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వారి మీద చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అనవసరంగా ఇప్పుడు విపక్షాలకు పెన్షన్ల విషయంలో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
పెన్షన్లు ప్రజలకు ఆర్థికంగా ఎంతో అండగా ఉంటూ ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని సమర్థవంతంగా అందించకపోతే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి సీఎం కేసీఆర్ కూడా దీని మీద కాస్త దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పెన్షన్లు అందక పోతే ఓటు బ్యాంకు కూడా భారీగా దూరం అయ్యే అవకాశం ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారీగా పెన్షన్లు ఇస్తున్నామని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పినా సరే ఓట్లు మాత్రం పడలేదు. దాదాపుగా 64 వేల మందికి దుబ్బాక నియోజక వర్గంలో ఆసరా పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.