కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులు, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ చాలీ, చాలనీ జీతాలతో దుర్బరమైన జీవితాలను గడుపుతున్నామని, వెంటనే తమను క్రమబద్దీకరించాలని కేజీబీవీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైఫాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టిపిసిసి మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద సంఘీభావం తెలిపారు. వారిని పర్మినెంట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టిపిసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన వీడియో కింద ఉంది చూడండి.
రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు భీష్మించి కూర్చున్నారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళన కారులను బలవంతంగా అరెస్టు చేసి నగరంలోని పలు స్టేషన్లకు తరలించారు.
విషయం తెలుసుకున్న టిపిసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అక్కడకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించారు. శ్రమకోర్చి పని చేస్తున్న కేజీబీవీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నేరేళ్ల శారద అన్నారు. వారి న్యాయ పరమైన డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుదన్నారు. మిగతా పార్టీలను కలుపుకొని ప్రభుత్వంపై ఐక్య పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. నేరేళ్ల శారదకు ఉద్యోగులు వారి సమస్యలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు పని చేయాల్సి వస్తోందని, సెక్టోరియల్ అధికారుల వేధింపులు కూడా ఉన్నాయని వారు ఆమెకు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సర్వీసులను రెగ్యూలరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం పై భారీ ఉద్యమం తప్పదని ఆమె హెచ్చరించారు.
