బాలయ్య నోరు జారారు…ఐటీ ఎంప్లాయిస్ వార్నింగ్, కంప్లైంట్

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఉపన్యాసాలతో జనాలకు పదే పదే దొరికిపోతున్నారు. కొన్ని నవ్వులు పాలు చేస్తూంటే…ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసే స్దితికి తెచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు తమపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని సీఈవో రజత్‌కుమార్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సందీప్‌ మక్తాలా మాట్లాడుతూ..చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్‌ నేర్పించామనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో ఒకరి కృషి వల్ల ఐటీ రంగం అభివృద్ధి సాధించలేదన్నారు. ఉద్యోగుల జోలికి రాకుండా ఎవరి ప్రచారం వారు చేసుకోవాలని చెప్పారు.

గత నాలుగు రోజుల నుంచి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మలక్‌పేట్, ఫతేనగర్‌లలో ఎన్నికల ప్రచారం చేసిన బాలయ్య, తెలంగాణను మళ్లీ దొరల పాలనకు టీఆర్ఎస్ తీసుకెళ్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని బాలకృష్ణ ఎద్దేవా చేశారు.