ఏపిలో కెసియార్ కు పెరుగుతున్న క్రేజ్..చంద్రబాబుకు షాక్

తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ కు ఏపిలో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. తెలంగాణాలో కెసియార్, ఏపిలో చంద్రబాబునాయుడు పాలనను పోల్చి చూసుకోవటం నాలుగేళ్ళ క్రితం నుండే మొదలైంది. ఎప్పుడైతే పోలికలు మొదలయ్యాయో కెసియార్ ముందు చంద్రబాబు చాలా అంశాల్లో  తేలిపోయారు. దాంతో కెసియార్ పై మెల్లిగా క్రేజ్ మొదలైంది. మొక్కు చెల్లింపుల పేరుతో తిరుపతి, విజయవాడకు వెళ్లినపుడు, పరిటాల శ్రీరామ్ వివాహానికి అనంతపురం జిల్లాకు వచ్చినపుడు జనాల జేజేలతో ఆ క్రేజు బయటపడంది.

రాష్ట్ర విభజనకు కారకుడైన కెసియార్ అంటే ఏపి జనాలు సహజంగా అయితే మండిపోవాలి. కానీ సీన్ రివర్స్ గేర్లో నడిచిందంటే అందుకు కారణం చంద్రబాబు చేతకాని తనమనే చెప్పుకోవాలి. చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతుండటంతో చంద్రబాబు పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. దాంతో సహజంగానే ఇద్దరు సిఎంలకు పోలికలు చూస్తున్న జనాలు కెసియార్ పాలనను మెచ్చుకుంటున్నారు. అందుకే కెసియార్ అంటే ఏపిలో కూడా క్రేజు పెరుగుతోంది.

అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించటంతో కెసియార్ పై ఉన్న తిరుగులేని ఇమేజి బయటపడుతోంది. ఫలితాలు వెలుడగానే తెలంగాణాలో సంబరాలు చేసుకోవటం మామూలే. కానీ తెలంగాణాలో టిఆర్ఎస్ విజయాన్ని ఏపిలో కూడా సెలబ్రేట్ చేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపిలోని గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం, గుడివాడ, తెనాలి, కాకినాడ, నరసాపురం లాంటి చోట్ల కెసియార్ పేరుతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. భారీ ర్యాలీలను కూడా తీశారు. అంటే సంబరాలన్నీ ప్రధానంగా వెలమ, వెలమ యువజన సంఘాల ఆధ్వర్యంలోనే జరిగినా సంబరాలు అందరినీ ఆకర్షించటం గమనార్హం.