బ్రేకింగ్ న్యూస్: ప్రగతి నివేదన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

టిఆర్ ఎస్ పార్టీ సెప్టెంబర్ 2న కొంగర కలాన్ లో నిర్వహించే ప్రగతి నివేదన సభ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సభకు అనుమతి ఇవ్వవద్దంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న నిర్వహిస్తోన్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సాంఘీక మాధ్యమాల ద్వారా చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలా సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటిషన్ ద్వారా కోరారు.

సభా స్థలిని పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి తెలిపారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ప్రజలకు అసౌకర్యం జరగకుండా సభ జరుపుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హామీ ఇవ్వడంతో హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. 

సభా ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యం