టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు ఎక్కువవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుసగా బీజేపీ పార్టీ చేతిలో దెబ్బ దెబ్బ మీద తగలడంతో కెసిఆర్ నాయకత్వం మీద నమ్మకం సన్నగిల్లి గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ లో ఇప్పుడు అంతర్గతంగా లుకలుకలు పెరిగిపోయాయి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని దాదాపు డిసైడ్ అయిపోయారు. అయితే దీనిని వ్యతిరేకించే వారు కూడా టీఆర్ఎస్ లో లేకపోలేదు.
కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఈ వ్యవహారంపై మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. హరీశ్ రావుకు పార్టీ క్యాడర్ లో మంచి పట్టుంది. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా హరీశ్ రావును కేసీఆర్ ఉపయోగించేవారు. హరీశ్ రావు కూడా కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసేవారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో హరీశ్ రావు తొలిసారి పార్టీ అధినేత నుంచి అసంతృప్తిని ఎదుర్కొన్నారు. పార్టీలో హరీశ్ రావు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు.
అసలు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్న విషయాన్ని కూడా హరీశ్ రావుకు చెప్పలేదు. అందరితో పాటు ఆయనకు తెలిసింది. దీనిపై కూడా అప్పట్లో హరీశ్ రావు అసంతృప్తికి గురయ్యారన్న వార్తలు వచ్చాయి. అయితే హరీశ్ రావు ఇంటికి స్వయంగా కేటీఆర్ వెళ్లడంతో అప్పట్లో సమస్య పరిష్కారమయింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హరీశ్ రావు తెలంగాణ భవన్ కు కూడా పెద్దగా రావడం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ప్రస్తుతం కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుతున్నారు. ఇది కూడా కేసీఆర్ కావాలనే చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈ విషయంలోనూ హరీశ్ రావును కేసీఆర్ పక్కన పెట్టారని గులాబీ పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఎప్పటికైనా టీఆర్ఎస్ కు హరీశ్ రావు నుంచి ప్రమాదం ఉండే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల భావన. కేసీఆర్ ఉన్నంత కాలం హరీశ్ రావు పార్టీకి బద్దుడిగానే వ్యవహరిస్తారు. అందుకే కేసీఆర్ ఇంత తొందరగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారన్న టాక్ విన్పిస్తుంది.