ప్రజా గాయకుడు గద్దర్ పోటి చేయబోయే స్థానం ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్థానం నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గురువారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీలను కలసినప్పుడు 45 నిమిషాల పాటు పాటలు పాడి వినిపించానన్నారు. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ’ పుస్తకం గురించి రాహుల్ కు వివరించానన్నారు.

ఢిల్లీలో సీఐడీ అడిషనల్ డీజీని కలిశానని.. తనకు భద్రత కల్పించాలని కోరానని గద్దర్ తెలిపారు. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ అధికారితో కూడా మాట్లాడానని చెప్పారు. తన ప్రచారంలో భాగంగా… తొలి దశలో ఎస్టీ, రెండో దశలో ఎస్సీ, మూడో దశలో బీసీ, నాలుగో దశలో పేద ఓటర్ల వద్దకు వెళ్లి… వారిలో ఓటుపై చైతన్యం కల్పిస్తానని అన్నారు. జర్నలిస్టులే తన సైన్యమని గద్దర్ అన్నారు. 

సాధారణ అవినీతి కంటే రాజకీయ అవినీతి అత్యంత ప్రమాదకరమైనదని ఆయన తెలిపారు. తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. శాంతి చర్చల కోసం ఎందరినో కలిశానని…ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా కలిసే అవకాశం ఉంటుందని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాజ్యాంగం, ఈ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.  ఈ నెల 15 నుంచి తెలంగాణలోని పల్లె పల్లెకు వెళతానన్నారు.  ఆదిలాబాద్ నుంచి తన ప్రచారం ప్రారంభిస్తానని గద్దర్ తెలిపారు.