తెలంగాణలో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. కొద్ది సేపటి క్రితమే మైకుల మోత బంద్ అయ్యింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్న చర్చల్లో జనాలు మునిగిపోయారు.
మరో వైపు పట్టణాలు, నగరాల్లో ఉన్న వారంతా పల్లె బాట పడుతున్నారు. అయితే ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేయనిస్తారు అన్న అపోహ ఉంటుంది. కానీ అటువంటి భయం లేకుండా 13 రకాల కార్టులను చూపించి ఓటు వేయవచ్చని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ఓటరు కార్డు లేకపోయినా సరే… ఓటర్ లిస్టులో పేరు ఉంటే తమ వద్ద ఉన్న కార్డు చూపించి ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవచ్చు. ఏ ఏ కార్డులు చెల్లుతాయి.
1.పాస్ పోర్ట్
2.డ్రైవింగ్ లైసెన్స్
3.ఆధార్ కార్డు
4.ఉపాధి హామీ పథకం కార్డు
5.ఆరోగ్య బీమా కార్డు
6.పాన్ కార్డు
7.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు ఐడి కార్డు చూపించి ఓటు వేయవచ్చు.
8.బ్యాంకు పాసు పుస్తకం
9. పోస్టాఫీస్ పాసు పుస్తకం
10.ఆర్ జీఐ జారీ చేసిన ఎన్ పీఆర్ స్మార్ట్ కార్డు
11.ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
12. ఈసీ జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు స్లిప్పు
13. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు
5 వతేది సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార గడువు ముగిసినప్పటి నుంచి మద్యం అమ్మకాలను కూడా నిలిపి వేయాలని ఈసీ ఆదేశించింది. డిసెంబర్ 5 వ తేది సాయంత్రం నుంచి 7 వతేది సాయంత్రం 5 గంటల వరకు డ్రై డేగా పాటించాలని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. ఒపీనియన్ సర్వేలు, ఇతరాత్ర ఎన్నికల కార్యక్రమాలను ప్రసారం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. సెల్ ఫోన్లను పోలింగ్ బూత్ కు అనుమతించరు.
పోలింగ్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బందోబస్తు పై పోలీసు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాల పై ఇప్పటికే డిజిపి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

డిసెంబర్ 7 వ తేది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు లైన్ లో ఉన్న వారందరిని కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. 5 దాటిన తర్వాత వచ్చే వారికి ఓటు వేసే అవకాశం ఉండదు. ప్రజలంతా కూడా ముందుగానే వచ్చి ఓటు వేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు.

మందు తాగొస్తే ఓటు ఉండదు
మందు తాగి బండి నడిపితే పోలీసులు బ్రీత్ ఎనలైజర్ లతో పోలీసులు పరీక్షలు చేయడం సాధారణమే. కానీ ఈ సారి ఎన్నికలలో అటువంటి సీన్లు కన్పించనున్నాయి. మద్యం తాగి ఓటు వేసేందుకు వస్తే పోలీసుల ఆపుతారు. ఓటు వేసేందుకు అనుమతించరు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ ఎనలైజర్ చేసిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తారు. మందు తాగినట్టు తేలితే అరెస్టు చేసి కేసు నమోదు చేస్తారు.
ఈ ఎన్నికల బరిలో మొత్తం 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్లో 3873, వనపర్తిలో 280 పోలింగ్కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీప్యాట్ యంత్రాలు, 39,763 కంట్రోల్ యూనిట్లను వినియోగించనున్నారు.

ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్ అధికారులు ఉంటారు. ఎన్నికల విధుల కోసం 279 మంది కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో మోహరించనున్నాయి. 30వేల మంది రాష్ట్ర భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.
