నిర్మల్ జిల్లా ఖానాపూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి రేఖానాయక్ నామినేషన్ పై సందిగ్ధత నెలకొంది. రేఖా నాయక్ దాఖలు చేసిన మూడు సెట్లలోనూ ఒక కాలాన్ని ఖాళీగానే ఉంచారు. ఉద్దూరుకి చెందిన రితేష్ రాథోడ్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి స్పందించిన రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కు అప్పీల్ చేశారు. కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ప్రతిపక్షాలు మాత్రం నామినేషన్ ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల నియమావళి ప్రకారం పూర్తి చేయని ఏ నామినేషన్ అయినా తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉంటుంది. మూడు సెట్లలోనూ రేఖా నాయక్ ఖాళీలు పూరించకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేఖా నాయక్ నామినేషన్ ఫాం పూర్తి చేసే బాధ్యత లాయర్లు, అనుభవం కలిగిన నేతల మధ్య పూర్తి చేశారని ఆమె వివరాలు సమర్పించి సంతకాలు చేశారన్నారు. ఇది ఎవరో కావాలనే చేసినట్టుగా ఉందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ప్రత్యర్దులు వచ్చి తప్పుదారి పట్టించారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చాలా బలమైన పరిస్థితిలో రేఖా నాయక్ టికెట్ సాధించారు. టిడిపిలో ఉన్న కీలకమైన నేత రమేష్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ కోసమే సంవత్సరం కింద టిఆర్ఎస్ లో చేరారు. కానీ దానిని పట్టించుకోకుండా టిఆర్ఎస్ మొదటి జాబితాలో కేసిఆర్ రేఖా నాయక్ కు టికెట్ కేటాయించారు. ఆయన అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అన్నింటిని తట్టుకొని తనకే టికెట్ కావాలని దక్కించుకున్న రేఖా నాయక్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండడంతో టిఆర్ఎస్ శ్రేణులు కలవరపడుతున్నారు. రిటర్నింగ్ అధికారి అప్పీల్ చేయడంతో ఖచ్చితంగా నామినేషన్ తిరస్కరణ అయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతా సక్రమంగానే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేఖానాయక్ నామినేషన్ పై వివాదం నెలకొనడంతో చర్చనీయాంశమైంది.
