కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి అధిష్టానం ఒకింత షాక్ ఇచ్చింది. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచీ ఏదైతే పదవి ఆశిస్తున్నారో ఆ పదవి ఇవ్వకుండా మరో పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో రేవంత్ వర్గంలో కొద్దిగా సంతోషం, ఎక్కువ బాధ ఉన్నట్లు కనబడుతున్నది. పూర్తి వివరాలివి.
రాహుల్ గాంధీ ఆంధ్రా పర్యటన ముగిసిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిసిసి కొత్త కమిటీలను నియమించే విషయమై చర్చించారు. అయితే రేవంత్ కు మాత్రం ఆశించిన పదవి దక్కలేదు. ఆయన తొలినుంచి కూడా పిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని కోరుతూ వచ్చారు. కానీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవితో అధిష్టానం సరిపెట్టింది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్లలోనే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేసింది. కానీ రేవంత్ తిరస్కరించారు. అంతేకాదు తనకు అధిష్టానం పిసిసి ప్రసిడెంట్ పదవి ఇచ్చినా తీసుకోనని తేల్చి చెప్పారు. దీంతో రేవంత్ పదవిపై పీటముడి పడింది. రేపు మాపు అంటూ రేవంత్ కు పదవి ఇవ్వడంలో అధిష్టానం తాత్సారం చేసింది.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోని కొందరు బడా సీనియర్లు సైతం రేవంత్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలను ఏకంగా రేవంత్ రెడ్డే ఓపెన్ గా చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీమాంధ్ర నేత (కేసిఆర్ కులస్థుడే) సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారా తనకు పదవి రాకుండా కేసిఆర్ కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్ గతంలో ఆరోపించారు.
ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తే రాష్ట్రమంతా తిరిగి కేసిఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడతానని రేవంత్ భావించారు. అదే విషయాన్ని అధిష్టానం వద్ద ప్రతిపాదించారు. కానీ ఆ పదవి రేవంత్ కు ఇస్తే వన్ మెన్ షోల మాదిరిగా మారుస్తాడంటూ సీనియర్లు రేవంత్ కు రాకుండా అడ్డుకట్ట వేశారు. టిడిపిలో పెద్ద లీడర్లు ఎందరున్నా రేవంత్ స్టార్ లీడర్ గా ఎదిగిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అలా అయితే పార్టీకి నష్టమంటూ ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో రేవంత్ కు కోరిన పదవి కాకుండా వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని కట్టెబట్టింది అధిష్టానం. ఆయనతోపాటు కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు కూడా వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని ఇచ్చింది.
53 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది అధిష్టానం. అయితే గమ్మత్తైన విషయం ఏమంటే పార్టీ మారి టిఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డికి కూడా కో ఆర్డినేషన్ కమిటీలో చోటు కల్పించి కాంగ్రెస్ పార్టీ మరోసారి తన మార్కు వైపల్యాన్ని ప్రదర్శించింది.
ఇక రేవంత్ ను కాదని క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ గా బట్టి విక్రమార్క, డి.కె అరుణ ను నియమించారు.
41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి హన్మంతరావును నియమించింది.
మేని ఫెస్టో కమిటీ ఛైర్మన్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మను నియమించింది.
ఎప్పటినుంచో ప్రచార కమిటీ సారధ్య బాధ్యతల మీద ఆశ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఈ పరిణామాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చింది కాబట్టి ఇదే పదవితో సరిపెట్టుకుంటారా? లేదంటే ఈ పదవి వద్దు అని అధిష్టానం మీద వత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారా అన్నది హాట్ టాపిక్ అయింది.

