ఇద్దరూ ఇద్దరే.! షర్మిలకీ కవితకీ పోలికేంటి.?

తెలంగాణ రాజకీయాలే కాదు, తెలుగునాట రాజకీయాల్లో ఇద్దరు మహిళా నేతలు టాక్ ఆఫ్ ది పొలిటికల్ ఇండస్ట్రీగా మారిపోయారు. ఒకరు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అయితే, ఇంకొకరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి. ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇంతకీ, ఈ ఇద్దరి మధ్యా పోలికలేంటి.? ఎవరు గొప్ప.? కవిత స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె. వైఎస్ షర్మిల స్వయానా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. కవిత తన తండ్రి స్థాపించిన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ షర్మిల తన సోదరుడు స్థాపించిన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదని షర్మిల చెబుతారుగానీ, ఆ పార్టీ తరఫున తెలుగు రాష్ట్రాల్లో ఆమె గతంలో గట్టిగా తిరిగారు. ఓ దశలో వైసీపీ తెలంగాణ విభాగం బాధ్యతలూ తీసుకున్నారు. ఆ లెక్కన రాజకీయాల్లో షర్మిలకీ మంచి అనుభవమే వుంది. అయితే, తండ్రి స్థాపించిన పార్టీ ద్వారా.. తెలంగాణ సెంటిమెంటుని నమ్ముకుని, ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత ఓడిపోయి, తండ్రి దయా దాక్షిణ్యాలతో ఎమ్మెల్సీ అయిన కవితకీ, సొంత పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకుంటున్న వైఎస్ షర్మిలకీ చాలా తేడా వుంది.

కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.. ఎందుకంటే సోదరుడు కేటీయార్ నుంచి పోటీ వుంది. వైఎస్ షర్మిలకి అలా కాదు. వైటీపీ గెలిస్తే.. ఆమే ముఖ్యమంత్రి అవుతారు. షర్మిల గనుక చట్ట సభలకు వెళ్ళాలనుకుంటే, అన్న జగన్‌ని బతిమాలుకుంటే సరిపోతుంది. సో, చాలా తేడాలున్నాయ్.! షర్మిలని కవిత అంతలా తూలనాడేయడం సబబు కాదు.