నర్సాపురం సీన్.. జనసైనికులకు కాలుతున్నట్టు ఉందిగా..?

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జరిగిన ‘ప్రజా వేదిక’ సాక్షిగా.. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి ముందే పబ్లిక్ క్లాస్ తీసుకోవడం ఇప్పుడు కూటమిలో పెను సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరు ఏమాత్రం బాగోలేదని, నియోజకవర్గంలో అన్నింట్లో మైనస్‌లో ఉన్నారంటూ చంద్రబాబు లైవ్‌లోనే విరుచుకుపడ్డారు.

“జిల్లా అంతా బాగానే ఉన్నా.. నర్సాపురం ఎందుకు వెనుకబడింది? సమస్యలు నాకు చెప్పడం కాదు, మీరే ప్రజలతో కలిసి పరిష్కరించాలి” అంటూ వేదికపైనే మైక్ పట్టుకుని చంద్రబాబు కడిగిపారేస్తుంటే, పక్కనే ఉన్న జనసేన ఎమ్మెల్యే నోట మాట రాక, బిక్కమొహం వేసి అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుండటంతో.. పవన్ కల్యాణ్ సైన్యం మరియు జనసైనికులకు తీవ్రంగా కాలుతున్నట్టు సమాచారం.

“మా ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకోవాలంటే పవన్ కల్యాణ్ చూసుకుంటారు.. బహిరంగ సభలో, అదీ ప్రజల ముందు మా లీడర్‌ను అంతలా అవమానించడం అవసరమా?” అంటూ జనసేన అంతర్గత వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మరోవైపు, టీడీపీ తమ్ముళ్లు మాత్రం బాబు వైఖరిని గట్టిగా సమర్థిస్తున్నారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు రిపోర్ట్ కార్డులు చూసి తప్పులు చెప్పడంలో తప్పులేదని, పెర్ఫార్మెన్స్ చూపించకపోతే సీనియర్ అయినా, మిత్రపక్షమైనా చంద్రబాబు ఇలాగే స్ట్రైట్‌గా కొడతారని కౌంటర్లు ఇస్తున్నారు.

ఈ పబ్లిక్ వార్నింగ్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ స్కెచ్ కూడా ఉండవచ్చనే అనుమానాలు రేగుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పట్టును, వారి ఎమ్మెల్యేల ఇమేజ్‌ను లైట్‌గా డ్యామేజ్ చేయడం ద్వారా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పైచేయి సాధించేందుకు ఈ రకమైన ‘రిపోర్ట్ కార్డు’ల అస్త్రాన్ని చంద్రబాబు బయటకు తీశారనే టాక్ నడుస్తోంది. కూటమిలో కాక రేపుతున్న ఈ ‘నర్సాపురం లొల్లి’ ముందు ముందు ఎలాంటి ముదురు రంగు పులుముకుంటుందో చూడాలి.