ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు దాటుతున్నా.. పైకి మాత్రం “మేమంతా ఒక్కటే.. మాది ఒకే మాట” అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ముచ్చటైన ముద్దుల ముచ్చట్లు చెబుతున్నారు. కానీ, అసలు కథ లోపల వేరేలా నడుస్తోందని మంగళగిరి టాక్. త్వరలోనే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీలను అస్సలు లెక్కచేయకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్లాన్ తాను సైలెంట్గా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్ హాలులో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జరిగిన తాజా ‘అవగాహన సదస్సు’ చూస్తే ఎవరికైనా ఈ ముచ్చట పక్కాగా అర్థమైపోతుంది. పార్లమెంటరీ కన్వీనర్లు, సమన్వయ కమిటీ సభ్యులను పిలిపించి మరీ నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో జెండాలు పాతాలని ఇచ్చిన పిలుపు.. మిత్రపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నిజానికి కూటమి అన్న తర్వాత సీట్ల సర్దుబాటు, మిత్రధర్మం వంటి ముచ్చట్లు మాట్లాడాలి.
కానీ తాడేపల్లి సమావేశంలో జనసేన లీడర్లు అసలు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. “పెద్దన్నయ్య అని టీడీపీ కింగ్ లా ఫీల్ అవ్వొచ్చు.. ఢిల్లీ బాస్ అని బీజేపీ బిల్డప్ ఇవ్వొచ్చు.. కానీ గ్రౌండ్ లో మన పవర్ ఏంటో చూపించాల్సిందే” అనే రేంజ్లో జనసైనికులు సమరశంఖం పూరిస్తున్నారు. నిన్నటివరకు సీట్ల కోసం టీడీపీ ఆఫీసుల చుట్టూ తిరిగిన పరిస్థితికి భిన్నంగా.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రతి చోటా జనసేన అభ్యర్థులను నిలబెట్టేందుకు నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి పొత్తుల పేరుతో తమ పార్టీ క్యాడర్ నష్టపోకూడదనే పక్కా కమర్షియల్ ప్లాన్తో పవన్ కళ్యాణ్ ఈసారి గట్టిగా పావులు కదుపుతున్నారు.
ఈ సరికొత్త పొలిటికల్ వ్యూహం టీడీపీ, బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. కూటమి సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ఎలాంటి చర్చలు జరగకముందే.. జనసేన ఇలా ముందస్తుగా అవగాహన సదస్సులు పెట్టి క్యాడర్ను ఉసిగొల్పడం ఏంటని పచ్చ తమ్ముళ్లు లోలోపల మదనపడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలు చేశాం కాబట్టి.. ఈ లోకల్ బాడీస్ లో మాత్రం తగ్గేదే లేదంటూ పవన్ కళ్యాణ్ సైన్యం పట్టుబడుతోంది. మొత్తానికి పైకి మిత్రపక్షాలంటూనే.. లోపల మాత్రం టీడీపీ, బీజేపీలను బకరా చేయడానికి జనసేన వేసిన ఈ సొంత స్కెచ్.. రాబోయే రోజుల్లో కూటమిలో ఎలాంటి చిచ్చు పెడుతుందో చూడాలి.