ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతమంది ఎన్ని వింతలు చేసినా, చివరికి అందరూ నమ్ముకునేది ఒక్కటే.. అదే ‘నడక’ రాజకీయం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాత్కాలికంగా బెంగళూరు ప్యాలెస్కే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మళ్లీ షూస్ వేసుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. వచ్చే 2029 ఎన్నికల కోసం అప్పుడే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూ, 2027 జూలై 8వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా సంకల్ప యాత్ర 2.0’ ప్రారంభించేందుకు జగనన్న ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ తమ్ముళ్లు లీకులు ఇస్తున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే.. జగన్ గారికి ఏ చిన్న ముహూర్తం కావాలన్నా వైఎస్సార్ జయంతి లేదా వర్ధంతి ఉండాల్సిందే. అందుకే ఈసారి కూడా ఏరికోరి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీని పాదయాత్రకు ఎంచుకున్నారు. “గతంలో పాదయాత్ర చేస్తేనే కదా 151 సీట్లు వచ్చాయి.. ఇప్పుడు మళ్లీ నడిస్తే పోయిన సీట్లన్నీ వెనక్కి వచ్చేస్తాయి” అనే రేంజ్లో వైసీపీ స్ట్రాటజీ టీమ్ సరికొత్త ఆశలు పెట్టుకుంది. క్యాడర్ అంతా డల్గా ఉన్న ఈ టైంలో, ఈ సెంటిమెంట్ వార్త చెబితేనైనా లీడర్లు పార్టీలో ఉంటారనేది ఇన్సైడ్ టాక్.
ఇక ఈ యాత్ర ఏదో ఒకటి రెండు నెలలు కాదు.. ఏకంగా 18 నెలల పాటు, అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు నిరంతరాయంగా సాగుతుందట. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హామీలను ఎలా ఎగ్గొడుతోంది, ప్రజలను ఎలా ముంచుతోంది అనే విషయాలను జనాల మధ్యలో కూర్చొని వివరించడమే జగనన్న ముఖ్య ఉద్దేశ్యమట. అయితే ఈ లోపు 2026 లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలాగోలా బతికించి, ఆ తర్వాతే 2027 లో జగన్ రోడ్డు మీదకు వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సరిగ్గా 2029 ఎన్నికల ముంగిట ఈ యాత్ర ముగిసేలా ప్లాన్ చేయడం చూస్తుంటే, జగనన్న తన మార్క్ పొలిటికల్ మైలేజ్ కోసం గట్టిగానే స్కెచ్ వేశారని అర్థమవుతోంది. మరి ఈ రెండోసారి నడక జగనన్నకు మళ్లీ సీఎం కుర్చీని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.