తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడు ఏ లీడర్ ఎలా ప్లేట్ తిప్పేస్తారో ఊహించడం గ్రేట్ డైరెక్టర్ల వల్ల కూడా కాదు. నిన్నటి దాకా “సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు.. మంత్రి పదవుల విషయంలో మాకు అన్యాయం జరుగుతోంది” అంటూ అంతర్గతంగా గుస్సా అయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడేమో సడన్గా రేవంత్ భజన అందుకోవడం చూసి గాంధీ భవన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం గారిని నేనెప్పుడూ దూషించలేదు బాబోయ్.. మా మధ్య అసలు గ్యాపే లేదు అంటూ రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన తాజా స్టేట్మెంట్ మునుగోడు నుంచి బెజవాడ దాకా హాట్ టాపిక్గా మారింది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. నియోజకవర్గానికి నిధులు రావడం లేదని అలకపాన్పు ఎక్కిన రాజగోపాల్ రెడ్డి, కట్ చేస్తే ఇప్పుడు నిధుల వరద పారుతోందని కలరింగ్ ఇస్తున్నారు. “సీఎం గారి కొడంగల్, డిప్యూటీ సీఎం గారి మధిరకు ఏ రేంజ్లో నిధులు ఇస్తున్నారో.. నా మునుగోడుకు కూడా అదే రేంజ్లో రూ. 2,000 కోట్లు ఇచ్చేశారు” అంటూ లెక్కలు చెప్తున్నారు. ఈ లెక్కలు విన్న నెటిజన్లు “అబ్బే.. మొన్నటి దాకా నిధులు లేవన్నారు.. ఇప్పుడు ఏకంగా రెండు వేల కోట్లా? కథ బాగానే కవర్ చేశారు సార్” అంటూ సెటైర్లు వేస్తున్నారు. పైగా సీఎం గారు మునుగోడు వస్తుంటే వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి వెల్కమ్ చెప్తారట.
ఇక మన రాజగోపాల్ రెడ్డి గారి అసలు నొప్పి మంత్రి పదవి గురించే అనేది ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పుడు మాత్రం చాలా నీతులు చెప్తున్నారు. “ఒకటి రెండు అంశాల్లో మాత్రమే విభేదించా.. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంది, హైకమాండ్ ఏం చెప్తే దానికి నేను తలాడిస్తా” అంటూ చాలా పద్ధతిగా మాట్లాడారు. మంత్రి పదవి రేసులో తమ్ముడిని కాదని రేవంత్ రెడ్డి వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తారేమో అన్న భయంతోనే రాజగోపాల్ రెడ్డి గారు ముందే ఇలా రూట్ మార్చి ‘సరెండర్’ అయిపోయారని పొలిటికల్ సర్కిల్స్లో జోకులు పేలుతున్నాయి. మరి ఈ ముందస్తు భజన రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి కుర్చీని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.