Zero Development : మూడేళ్ళ వైసీపీ పాలనలో అభివృద్ధి ఎక్కడ.? అని ప్రశ్నిస్తే, వాలంటీర్లు.. గ్రామ సచివాలయాలు.. అంటున్నారు అధికార పార్టీ నేతలు. అసలు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనా.? అంటే, కానే కాదని వైసీపీ ప్రభుత్వమే చెబుతోంది. రాజధాని కట్టలేకపోయారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు.. అలాంటప్పుడు అభివృద్ధ చేశామని ఎలా చెప్పుకుంటారు.? అన్నది విపక్షాల వాదన.
రానున్న రెండేళ్ళలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నది వైసీపీ నేతల వాదన. ఇంకోపక్క, ‘వైసీపీకి కూల్చడం తప్ప, కట్టడం రాదు..’ అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి విసక్షాలు. ‘ఇంకోసారి వైసీపీ గనుక అధికారంలోకి వస్తే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైనా పూర్తిగా మర్చిపోవాల్సిందే..’ అంటూ అధికార వైసీపీ ఇప్పటికే ప్రచారం షురూ చేసింది.
ఏపీ అప్పలు చంద్రబాబు హయాంలో గణనీయంగా పెరిగాయి.. అంతకు మించిన స్థాయిలో వైఎస్ జగన్ హయాంలో అప్పులు జరిగాయి. ఇదైతే ఎవరూ కాదనలేని వాస్తవం. చంద్రబాబు హయాంలో తాత్కాలికం పేరుతో అమరావతిలో హైకోర్టు, సెక్రెటేరియట్, అసెంబ్లీ వంటివి కట్టిన మాట వాస్తవం.
మరి, వైఎస్ జగన్ హయాంలో కొత్తగా నిర్మితమైనవి ఏమున్నాయ్.? వీటిపై సమాధానం చెప్పలేని పరిస్థితి వైసీపీదే. ‘రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నారు.. ఆ సొమ్ములెక్కడికి పోతున్నాయ్.?’ అని విపక్షాలు ప్రశ్నిస్తోంటే, ‘సంక్షేమ పథకాల రూపంలో జనానికే ఇస్తున్నాం..’ అన్నది వైసీపీ వాదన.
జనం చేతుల్లో ఆ సంక్షేమ పథకాల తాలూకు డబ్బులెన్ని రోజులు వుండిపోతాయ్.? సంక్షేమ క్యాలెండర్ పెట్టి పంపకాలు చేపట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. పైగా, అప్పులు పెరిగిపోయి, రాష్ట్రం అదోగతి పాలైపోతుందనీ, అది ప్రజలకు అర్థమైననాడు వైసీపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా వుంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
