దావోస్ అంటే అదొక మాయ. వరల్డ్ ఎకనమిక్ ఫోరం పేరుతో దావోస్ నడిచే వ్యవహారాలపై చాలా చాలా ఆరోపణలున్నాయి. అధికారంలో వున్నవాళ్ళు తాము దోచుకున్నది విదేశాల్లో దాచుకునేందుకు ‘దావోస్’ని ఒక వేదికగా చేసుకుంటారన్న ఆరోపణలు ఈనాటివి కావు. చంద్రబాబు హయాంలో వైసీపీ చేసిన ఆరోపణలే ఇవి. ఇప్పుడు వైసీపీ, ఆ దావోస్ గురించి బహు గొప్పగా చెప్పేస్తోంది.
ఒకప్పటి చంద్రబాబు దావోస్ పబ్లిసిటీ స్టంట్లపై వైసీపీ చేసిన వెటకారాలన్నీ, ఇప్పుడు వైసీపీ మీదకు బూమరాంగ్ తరహాలో రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి. దాంతో, అధికార వైసీపీ.. ఆ విమర్శల్ని ఎదుర్కొనడానికి నానా తంటాలూ పడుతోంది. ఈ క్రమంలో ఎదురుదాడి చేయక తప్పడంలేదు వైసీపీకి, టీడీపీ మీద.
దోచుకోవడం, దాచుకోవడం వ్యవహారాల్ని పక్కన పెడితే.. దావోస్ వెళ్ళి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్కి అర్థ రూపాయి అయినా మేలు చేసే వ్యవహారాలేమైనా చక్కబెట్టుకొచ్చారా.? అన్నదే అసలు ప్రశ్న ఇక్కడ. దాదాపు లక్షన్నర కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నది వైసీపీ ప్రభుత్వం చెబుతున్నమాట.
వాస్తవానికి ఈ అవగాహనా ఒప్పందాలనేది మళ్ళీ ఓ పెద్ద బూటకంగా అభివర్ణిస్తారు ఆర్థిక రంగ నిపుణులు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితి ఏంటి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఎందుకు పెట్టుబడులు పెడతారు.? అన్నదానిపై లోతైన చర్చ జరగాల్సి వుంది.
కోనసీమ అల్లర్లు, రాష్ట్రంలో విద్యుత్ కోతలు, రాజకీయంగా నిత్యం రావణ కాష్టంగా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులు ఎందుకు చూస్తారు.? పైగా, రాష్ట్రానికి రాజధాని వున్నా లేటనట్టే వుందాయె పరిస్థితి. రానున్న రెండేళ్ళలో గట్టిగా ఏడాది సమయమే వుంటుంది వైసీపీకి. ఈ ఏడాదిలో పైన పేర్కొన్న లక్షా యాభై వేల కోట్ల అవగాహనా ఒప్పందాల్లో అర్థ రూపాయి అయినా రాష్ట్రానికి వస్తే.. అది గొప్ప విషయమే అనుకోవాలేమో.!
