సీమలో బీజేపీకి అలా ‘లాక్‌’ వేసిన వైఎస్‌ జగన్

YS Jagan Locked BJP

రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలి..’ అంటూ భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికలకు ముందు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీనే. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే, అది కేంద్రం పరిధిలోని అంశమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయానికి కేంద్రం తరఫున బీజేపీనే ఆమోద ముద్ర వేయాల్సి వుంటుంది. అయితే, బీజేపీ – టీడీపీ కలిసి ప్రభుత్వాల్ని నడిపిన రోజుల్లో, హైకోర్టుని అమరావతిలో ఏర్పాటు చేయడం చూశాం. అది కేవలం చంద్రబాబు నిర్ణయం మాత్రమేనని అనుకోవడానికి వీల్లేదు. అది టీడీపీ – బీజేపీ సంయుక్త నిర్ణయం. పార్టీల నిర్ణయమే కాదు, ప్రభుత్వ నిర్ణయం కూడా. ఇక, ఇప్పటి విషయానికొస్తే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వద్ద కర్నూలులో హైకోర్టు అంశాన్ని ప్రస్తావించారు.. కుండబద్దలుగొట్టారు కూడా.!

YS Jagan Locked BJP
YS Jagan Locked BJP

కేంద్రం సహకరిస్తుందా.? లేదా.?

కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చాలానే పెండింగ్‌లో వున్నాయి. నిధులకు సంబంధించిన అంశాలు చాలా వున్నాయి. నిధులతో సంబంధం లేనివీ వున్నాయి. అయితే, దేనికీ కేంద్రం అంత తేలిగ్గా ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఇవ్వడంలేదు. శాసన మండలి రద్దు విషయాన్నే తీసుకుంటే, కేంద్రం ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై స్పందించలేదాయె. దిశ బిల్లు, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం.. ఇలాంటి వాటిల్లో కూడా కేంద్రం, రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడంలేదన్నది నిర్వివాదాంశం. మరి, కర్నూలులో హైకోర్టు విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేసిన జగన్‌!

హైకోర్టు అనే అంశాన్ని చాలా తెలివిగా వైఎస్‌ జగన్‌, బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. ‘గతంలో మీరే హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేం చెయ్యాల్సింది చేశాం. ఇకపై బాధ్యత మీదే..’ అని అమిత్‌ షాకి, వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారట. అంటే, ఇప్పుడీ అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయినట్లే భావించాలేమో.! సరే, కేంద్రం ఎలా స్పందిస్తుంది.? అన్నది వేరే చర్చ. కానీ, ఈలోగా రాష్ట్రంలో బీజేపీ మీద వైసీపీ మాత్రం ఈ అంశంతో పొలిటికల్‌ అడ్వాంటేజ్‌ సాధించేయగలుగుతుంది.

తిరుపతి ఉప ఎన్నికలో ఇదే కీలకాంశమా.?

తిరుపతి కూడా రాయలసీమలోనే వుంది. ఆ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. బీజేపీ అధిష్టానం, తిరుపతి ఉప ఎన్నికపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. బలం లేని చోట, బలం నిరూపించుకోవాలన్న కసి బీజేపీలో వుంది. అలా కసి ప్రదర్శించిన ప్రతిసారీ బీజేపీ మంచి ఫలితాల్నే సాధించింది. అయితే, ‘రాయలసీమ – హైకోర్టు’ సెంటిమెంటుతోపాటు, వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేక హోదా వంటి అంశాలపై బీజేపీని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా నిలదీయడం వైసీపీకి చాలా తేలికైపోనుంది ఇకపై. మరి, వైఎస్‌ జగన్‌ విసిరిన ఈ వలలోంచి బీజేపీ తప్పించుకునేదెలా.?