YCRP Ministers : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారమే లేదని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ‘ఏడాదిలోనో, రెండేళ్ళలోనో ఎన్నికలకు వెళతాం..’ అంటూ ఇటీవల వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయమే. దాంతో, వైసీపీ మంత్రుల్లో.. అందునా కొత్త మంత్రుల్లో గుబులు రేగింది.
‘మంత్రి పదవులొచ్చాయన్న ఆనందంలో వున్నాం.. ఈ ఆనందం ఏడాదిలోనే ఆవిరవుతుందా.?’ అంటూ పలువురు కొత్త మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోతున్నారట. ‘అబ్బే, అలాంటి ఆలోచనేమీ లేదు..’ అంటూ ముందస్తుపై ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చేశారంటూ వైసీపీ కొత్త మంత్రులు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు.
ఆశావహులు బోల్డంత మంది వుండగా.. పాత మంత్రుల్లో కొందరు, తిరిగి తమకే పదవులు రావాలని భీష్మించుక్కూర్చోగా.. నానా తంటాలూ పడి, కొందరు కొత్తవారికి ముఖ్యమంత్రి తన మంత్రి వర్గంలో ఆస్కారం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కొత్త మంత్రులు, పదవుల కోసం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అందుకే, ఏడాదిలోనే పదవి పోతుందనే విషయాన్ని వాళ్ళసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎలాగైతేనేం, ముందస్తు ముచ్చట లేదని అధిష్టానం నుంచి స్పష్టత వచ్చేయడంతో, ‘హమ్మయ్యా..’ అనుకుంటున్నారట. మరోపక్క, మాజీ మంత్రలు మాత్రం, ‘ఇంకో రెండేళ్ళు వేచి చూడాలా.? ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు.. ముందస్తు ఎన్నికలకు వెళితే గెలిచేస్తాం..’ అంటూ తమ పదవుల కోసం అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారట.
