రాహుల్ గాంధీతో భేటీ అవ్వాలనుకున్న ఆ వైసీపీ నేత ఎవరు.?

Rahul Gandhi : కాంగ్రెస్, వైసీపీ మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమనేంత వైరం వుంది. అదే కాంగ్రెస్ పార్టీ నుంచే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే, తమ కుటుంబాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్న భావనతో వైఎస్ జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ.. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి, కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి నివేదిక ఇచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ – వైసీపీల మధ్య పొత్తు వుండాల్సిన అవసరాన్ని అందులో వివరించిన సంగతి తెలిసిందే. ‘రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే వారితో కలుస్తాం..’ అని వైసీపీ నేతలు కొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీతో పొత్తు అసాధ్యమనీ ఇంకొందరు వ్యాఖ్యానించారు.

తాజాగా, కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, తెలంగాణలో పర్యటించినప్పుడు, ఓ వైసీపీ ముఖ్య నేత ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వహించారు. పైగా, రాహుల్ గాంధీకి ఆయన అత్యంత సన్నిహితుడట. నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడే చనువు ఇప్పటికీ ఆయనకు వుందంటున్నారు.

అయితే, ఇది నిజమా.? కాదా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చీమ చిటుక్కుమన్నా గుర్తించేంత స్థాయిలో నెట్వర్క్ కలిగి వుంటుంది వైసీపీ. తమ నేతలపై వైసీపీ నిఘా పెట్టడం అనేది సర్వసాధారణం. అలాంటప్పుడు, ఏకంగా తమ పార్టీకి చెందిన నేత, తమ బద్దశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడ్ని కలిసేందుకు ప్రయత్నిస్తే పసిగట్టకుండా వుంటుందా.?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక అధికారంలోకి వచ్చే పరిస్థితి వుంటే, కాంగ్రెస్ ఎలాగూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుంది గనుక, ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు వచ్చే అవకాశాన్ని వైసీపీ ఎందుకు వదులుకుంటుంది.?