ys Jagan : గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పేరుతో అధికార వైసీపీ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీని జనంలోకి ఇంకా బలంగా తీసుకెళ్ళడమే ఈ ‘గడప’ కాన్సెప్టు తాలూకు ఉద్దేశ్యం. అయితే, అడుగడగునా అధికార పార్టీ నాయకులకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు కూడా.
కోవిడ్ పాండమిక్ కావొచ్చు, నాయకుల అలసత్వం కావొచ్చు.. కింది స్థాయిలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నా, అధికార పార్టీ మీద వ్యతిరేకత బాగానే వుంది. రోడ్ల సమస్యలు, కరెంటు సమస్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, సమస్యలు చాలానే వున్నాయ్. ‘అబ్బే, మేం అత్యద్భుతమైన పాలన అందించేస్తున్నాం..’ అని వైసీపీ చెప్పుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది.
గత పాలకులకంటే మెరుగైన పాలన అందిస్తున్నామని మాత్రమే ప్రస్తుత వైసీపీ చెప్పుకోవాలి. సరే, రాజకీయాల్లో ‘సొంత డబ్బా’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అది తప్పదు కూడా.!
గడప గడపకూ అధికార పార్టీ వెళ్ళడం వల్ల మరింతగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి. పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై మరింత అవగాహన ఏర్పడుతుంది. వీటికి తోడు, కింది స్థాయిలో పార్టీ పరిస్థితేంటన్నది కూడా వైసీపీ అధిష్టానానికి ఓ అవగాహన వస్తుంది.
జరుగుతున్న నిలదీతలపై అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నిలదీతలకు సంబంధించి ఆయా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయగలిగితే, 2024 ఎన్నికల్లో అత్యద్భుత విజయాన్ని అందుకోగలమన్నది వైసీపీ ధీమా. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘గడప’ కార్యక్రమం వెనుక అసలు సీక్రెట్.
