ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్క.! ఏది నిజం.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ మధ్య కొత్తగా, శ్రీలంకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోల్చడం చూస్తున్నాం. ఇంతకీ ఏది నిజం.? రాష్ట్రానికి వున్న అప్పుల మాటేమిటి.? అందులో వాస్తవాలేమిటి.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం మొదలైంది. అప్నటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తేరుకోలేదు. విభజన గాయాలకు తోడు, అప్పట్లో చంద్రబాబు సర్కారు, ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు.. రాష్ట్రాన్ని మరింతగా అప్పుల్లోకి నెట్టేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

పొరుగు రాష్ట్రం తెలంగాణ.. నిజానికి ధనిక రాష్ట్రం. తెలగాణ కూడా అప్పులు చేసింది కదా.? అంటే, తెలంగాణలో అభివృద్ధి కనిపిస్తోంది. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యింది. తెలంగాణ రాజధాని హైద్రాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి కళ్ళముందే వుంది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? రాజధాని లేదు, జాతీయ ప్రాజెక్టు పోలవరం కూడా పూర్తవలేదు. కానీ, అప్పుల్లో తెలంగాణను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. కేంద్రం చెప్పిన తాజా లెక్క ప్రకారం ఆంధ్రప్రేదశ్ అప్పు సుమారు 3.98 లక్షల కోట్లు. తెలంగాణ అప్పు కూడా మూడు లక్షల కోట్లు దాటినా, ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువే.

వైసీపీ సొంత మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ మాట చెబుతోంది, తెలంగాణ ప్రజలకు ఇంకో మాట చెబుతోంది. గడచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ 3.98 లక్షల కోట్లు అప్పు చేసినట్లు తెలంగాణ ఎడిషన్ చెబుతోంటే, ఏపీ ఎడిషన్ మాత్రం.. ఆ 3.98 లక్షల కోట్లను మొత్తం అప్పుగా చెబుతోంది. ఇదే అసలు సమస్య.

అప్పులు చేయడం తప్పు కాదు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలూ అప్పుల బాట పట్టాయి. దానికి తోడు సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాల నిమిత్తం.. అప్పులు చేయకపోతే ప్రభుత్వాలు నడవడంలేదు. కానీ, ప్రజలకు మాత్రం ప్రభుత్వాలు వాస్తవాలు చెప్పకపోవడంతోనే ఈ ఇబ్బంది వస్తోంది.