తెలంగాణ‌లో టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు లేకుండానే పైత‌ర‌గ‌తుల‌కు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో వైర‌స్ ప్రబలివున్న  సందర్భంలో పదవ తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకు ని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇలాంటి నిర్ణ‌యాన్నే చ‌త్తీస్ ఘ‌డ్ ప్ర‌భుత్వం కూడా తీసుకుంది. అక్క‌డా ఎలాంటి ప‌రీక్ష‌లు లేకుండా పై త‌ర‌గ‌తుల‌కు విద్యార్ధుల‌ను ప్ర‌మోట్ చేస్తుంది. కానీ త‌ర‌గ‌తి గ‌దుల్లో స్కూల్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల మార్కుల‌ను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. కాగా ఏపీ ప్ర‌భుత్వం మాత్రం జూలై నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఇక్క‌డా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. స‌డ‌లింపుల నేప‌థ్యంలో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వం నిర్ణ‌యాల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.