తాజ్ మహల్ ఢిల్లీలో వుందా.? ఇరకాటంలో ఏపీ మంత్రి రోజా.!

Minister Roja

Minister Roja  : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి వాగ్ధాటి కలిగిన నేతల్లో నగిరి ఎమ్మెల్యే రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. మంత్రి అంబటి రాంబాబు కూడా అంతే. కానీ, మంత్రులయ్యాక అటు అంబటి రాంబాబు, ఇటు రోజా.. ఇద్దరూ మాట తడబడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయమై మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేసిన వైనం, ఈ క్రమంలో ఆయన మాట్లాడిన అర్థం పర్థం లేని మాటలు విపరీతమైన ట్రోలింగ్‌కి గురైన విషయం విదితమే. తాజాగా మంత్రి రోజా, తాజ్ మహల్‌పై చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్‌కి గురవుతున్నాయి.

‘హైద్రాబాద్‌లో చార్మినార్ వుంది.. తాజ్ మహల్ ఢిల్లీలో వుంది..’ అంటూ తాజాగా రోజా వ్యాఖ్యానించారు.. అదీ మంత్రి హోదాలో. సినీ పరిశ్రమ కార్మికుల సమస్యల విషయమై రోజా భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ రోజా, తాజ్ మహల్ ప్రస్తావన తెచ్చారు.

తాజ్ మహల్ వున్నది ఆగ్రాలో కదా.? ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళింది తాజ్ మహల్.. అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు మంత్రి రోజాని.
‘జయంతికీ వర్ధంతికీ తేడా తెలియని పప్పు నారా లోకేష్..’ అంటూ పదే పదే రోజా విమర్శిస్తుంటారు. ఆమె ఇప్పుడు ఇదిగో ఇలా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నది టీడీపీ మద్దతుదారుల ఆరోపణ. మాటల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లడం ఎవరికైనా సహజమే, అది నారా లోకేష్ అయినా.. రోజా అయినా.. ఇంకెవరైనా.!