దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతినాడు కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ వేదికగా కొత్త రాజకీయ పార్టీ పేరుని తన తండ్రి వైఎస్సార్ జయంతి రోజున ప్రకటించనున్నట్లు షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ ఆశీస్సులు తీసుకునేందుకు ఆమె ఇడుపులపాయ వెళ్తారు. మరోపక్క, ప్రతియేడాదీ వైఎస్సార్ జయంతినాడు, తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు వైఎస్ జగన్.
ఈ ఏడాది కూడా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు వైఎస్ జగన్ నిర్వహించనున్నారు. అయితే, ఒకే రోజు షర్మిల, వైఎస్ జగన్.. ఇడుపులపాయకు వెళుతున్నా, ఇద్దరూ కలవబోరట. కలిసి తమ తండ్రికి నివాళులర్పించరట.
షర్మిల ఉదయాన్నే నివాళులర్పించే కార్యక్రమం పూర్తి చేసుకుంటారనీ, మధ్యాహ్నం తర్వాతే వైఎస్ జగన్, ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్దకు వెళతారనీ తెలుస్తోంది. వైఎస్ జగన్, తన సోదరిని కలవడం ఇష్టం లేక, తన అధికారిక పర్యటన షెడ్యూల్ మార్చుకున్నారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి, ముందు అనుకున్న షెడ్యూల్ నిజంగానే మారింది వైఎస్ జగన్ విషయంలో. అయితే, మరీ అంతలా ఇద్దరి మధ్యా రాజకీయ విభేధాలు వచ్చేశాయా.? అన్న చర్చ వైఎస్సార్ అభిమానుల్లో జరుగుతోంది.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఇద్దరూ రాజకీయంగా ఒకరితో ఒకరు విభేదించుకోవడమే ఇరువురి రాజకీయ భవిష్యత్తుకి మంచిదన్నది ఆ వైస్సార్ అభిమానుల్లోనే జరుగుతున్న చర్చ. కాగా, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలైన విజయమ్మ, షర్మిల కోసం తనవంతుగా కష్టపడుతున్నారు.
ఎటూ వైఎస్ జగన్.. ఏపీలో అధికారంలో వున్నారు గనుక, ఆయనకు విజయమ్మ నుంచి అదనపు మద్దతు అవసరం వుండదు. కానీ, షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే విజయమ్మ అండదండలు తప్పనిసరి.