షర్మిల పోటీ చేయబోయేది ఆ నియోజకవర్గం నుండేనా ?

Ys sharmila sensational comments on ys jagan

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై నేతలకు క్లారిటీ ఇచ్చారా , ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై వైఎస్ఆర్ కూతురు ఓ నిర్ణయానికి వచ్చారా ? ఈ ప్రశ్నకు ఆమె సన్నిహితుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల.. ఎక్కువగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

YS Sharmila: షర్మిల పోటీ చేయబోయే సీటుపై క్లారిటీ.. ఆ జిల్లా నుంచే..

ఇందుకు అసలు కారణంగా గతంలో ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ కొన్ని స్థానాలు గెలుచుకోవడమే. అయితే తాజాగా ఈ జిల్లా నుంచే పోటీ చేసే విషయంపై షర్మిల తన సన్నిహితులకు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. తెలంగాణ ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఇక్కడి నుంచి టీఆర్ఎస్ నేతగా బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారని.. ఇందుకు ఆమె కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు పాలేరు నుంచి పోటీ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని షర్మిల సన్నిహితులు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి